తమ్ముడితో అక్క పెళ్లి: ఏడేళ్ల తర్వాత తెలిసింది
సావో పాలో: బ్రెజిల్లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఆడ్రియానా అనే మహిళకు విచిత్ర అనుభవం ఎదురైంది. ఆమె పెళ్ళి చేసుకున్నది తోబుట్టువునే అన్న విషయం వివాహమైన ఏడేళ్ళ తర్వాత తెలిసింది. ఇప్పుడు వారికి ఓ పాప కూడా. ఆడ్రియానా (39) కాస్మెటిక్స్ సేల్స్ ఉమన్ కాగా, ఆమె భర్త లియాండ్రో (37) ఓ ట్రక్ డ్రైవర్.
వీరిలో ఆడ్రియానా లియాండ్రో కంటే రెండేళ్ళు పెద్దది. వీరి తల్లి మారియా వీరిద్దరినీ చిన్నతనంలోనే వదిలేసింది. తొలుత ఆడ్రియానాను, అనంతరం లియాండ్రోను వదిలేసింది. అనంతరం ఈ అక్కాతమ్ముడు వేర్వేరుగా వేరే ప్రాంతాల్లో అనాథలుగా పెరిగి పెద్దవారయ్యారు. యుక్తవయస్సుకు వచ్చిన తర్వాత కాకతాళీయంగా పెళ్ళిచేసుకున్నారు.
తమ ఇద్దరు తల్లుల పేర్లు మారియా కావడం కాకతాళీయం అని భావించేవారట. కానీ, అప్పటికి తెలియదు ఆ జోడీకి, తమ ఇద్దరి తల్లి ఒక్కతేనని. అయితే, సావోపాలోలోని గ్లోబ్ రేడియాకు ఓ ప్రత్యేకత ఉంది. జాడ తెలియకుండా పోయిన బంధువులను వెతికిపట్టుకునేందుకు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుందీ రేడియో స్టేషన్.
ఈ కార్యక్రమం ద్వానా ఆడ్రియానా తన తల్లి మారియాను కోసం ప్రయత్నిస్తుంటే, తన పెళ్లి రహస్యం తెలిసింది. తనకో కుమారుడు ఉండేవాడని, అతని పేరు లియాండ్రో అని మారియా చెప్పింది. అతను ఆడ్రియానా భర్తేనని తెలిసింది. కానీ, ఇప్పుడు తామిద్దరం ఒక్కటయ్యామని, ఇది భగవంతుడి లీల అని ఆడ్రియానా, లియాండ్రో అంటున్నారు. భార్యాభర్తలుగానే కొనసాగుతామని స్పష్టం చేశారు.