పాక్ ఎన్నికల్లో రికార్డ్: జనరల్ సీట్లో గెలిచిన తొలి హిందూ అభ్యర్థి ఇతడే
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో ఓ హిందువు సంచలనం సృష్టించారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)తరపున ఎన్నికల్లో పోటీ చేసి జాతీయ అసెంబ్లీకి ఎన్నికై మహేష్ కుమార్ మలానీ రికార్డు సృష్టించారు. దేశంలో 16ఏళ్ల క్రితం నాన్ ముస్లింలకు ఓటు హక్కు, జనరల్ సీట్ల నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించిన తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.
తాజాగా జరిగిన పాక్ సార్వత్రికి ఎన్నికల్లో సదరన్ సింధ్ ప్రావిన్స్లోని థార్పార్కర్-II నుంచి జాతీయ అసెంబ్లీ(ఎన్ఏ-222)కి మహేష్ మలానీ ఎన్నికయ్యారు. ఆయనకు ప్రత్యర్థులుగా 14మంది పోటీలో ఉన్నప్పటికీ ఘన విజయం సాధించారని డాన్ పత్రికి వెల్లడించింది.

1,06,630 ఓట్లు మలానీకి రాగా, అతని సమీప ప్రత్యర్థి అర్బాబ్ జకౌల్లాహ్(గ్రాండ్ డెమోక్రాటిక్ అలయన్స్)కి 87,251ఓట్లు వచ్చాయి. పాకిస్థానీ హిందువైన మలానీ రాజస్థానీ పుష్కరణ్ బ్రాహ్మిణ్ రాజకీయ నేత.
2003-08లో పార్లమెంటు సభ్యుడిగా నామినేటెడ్ సీటును పీపీపీ ఆయనకు కేటాయించింది. 2013లో ప్రావిన్సియల్ అసెంబ్లీ సభ్యుడిగా థార్పర్కర్-III సింధ్ అసెంబ్లీ జనరల్ సీటు నుంచి తొలి ముస్లిమేతర సభ్యుడిగా ఎన్నికయ్యారు.
ఆహారంపై సింధ్ అసెంబ్లీ స్టాండింగ్ కమిటీకి ఆయన ఛైర్ పర్సన్గా వ్యవహరించారు. ఇతర పదవులు కూడా ఆయన నిర్వహించారు. కాగా, ఈ ఏడాది మార్చిలో పీపీపీ తరపున కృష్ణకుమారి అనే హిందు మహిళ తొలిసారిగా థార్పర్కర్ నుంచి గెలుపొందారు.
2002లో అప్పటి అధ్యక్షుడు జనరల్ రిటైర్డ్ పర్వేజ్ ముషార్రఫ్ రాజ్యంగ సవరణ చేసి ముస్లిమేతరులకు ఓటు వేసే హక్కుతోపాటు పార్లమెంటు జనరల్ సీట్లలో పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు.












Click it and Unblock the Notifications