మా సోదరిని విడవకుంటే, ఇద్దర్ని చంపేస్తాం: ఐసిస్ వీడియో, ఎవరీ సాజిదా?
న్యూఢిల్లీ: తమ సోదరి సాజిదా ఆల్ రిశ్వాయిని విడుదల చేయకుంటే తాము ఇద్దరు ప్రముఖులను హతమార్చుతామని ఐసిస్ మరో వీడియోను విడుదల చేసింది. ఐసిస్ డబ్బుల కోసం డిమాండ్ చేయడం లేదు. అయితే, అరెస్టైన తమ సోదరిని విడుదల చేయాలని ఆ వీడియోలో పేర్కొన్నారు.
తమ సోదరి సాజిదాను విడుదల చేయకుంటే తాము జోర్డాన్ పైలట్ లెఫ్టినెంట్ మౌత్ ఆల్ కసేస్బా, జపాన్ జర్నలిస్ట్ కేంజీ గోటోలను చంపేస్తామని ఐసిస్ హెచ్చరించింది. ఇరవై నాలుగ గంటల్ల విడుదల చేయకుంటే తాము హతమారుస్తామని చెప్పింది.
ఎవరీ సాజిదా ఆల్ రిశ్వానీ
సాజిదా ఆల్ రిశ్వానీ ఓ సూసైడ్ బాంబర్. ఆమె, తన భర్త 2005లో జోర్డాన్లోని ఓ హోటల్లో సూసైడ్ బాంబ్గా వెళ్లారు. ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా అల్ ఖైదాకు చెందిన వారు. అల్ ఖైదా వారిని హోటల్కు సూసైడ్ బాంబర్లుగా పంపించింది.
ఈ సూసైడ్ బాంబు ఘటనలో ఆమె భర్త చనిపోయాడు. అయితే ఈమె గాయాలతో బయటపడింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. తాను, తన భర్త సూసైడ్ బాంబర్లుగా వచ్చినట్లు ఆమె విచారణలో వెల్లడించారు. అనంతరం ఆమెకు జైలు శిక్ష విధించారు.
ఐసిస్ సోదరి
ఐసిస్ ఆమెను సోదరిగా పిలుస్తోంది. వీడియోలో ఆమెను సోదరిగా అభివర్ణించారు. అయితే, 2005లో వారు సూసైడ్ బాంబర్లుగా ఉన్నప్పటికీ ఐసిస్ తీవ్రవాదం ఇంకా పుట్టలేదు. ఈ నేపథ్యంలో ఆమెతో వీరికి ఎలా లింక్ కుదిరిందనే ప్రశ్న ఉదయిస్తోంది.
సాజిదా ఆల్ రిశ్వానీ అల్ ఖైదా సభ్యుడు అబూ ముసాబ్ ఆల్ జర్కావీ సోదరిగా విచారణలో తేలింది. అతను 2005లో ఆల్ ఖైదాలో ఉన్నాడు. అనంతరం అతని అనుచరులు అబూ బకర్ భాగ్దాదీ నెలకొల్పిన ఐసిస్ ఉగ్రవాద సంస్థ వైపు వెళ్లారు. అప్పటి నుండి జర్కావీ ఐసిస్తోను సంబంధాలు నెరపుతున్నట్లుగా భావిస్తున్నారు. ఈ కారణంగానే వారు ఆమెను సోదరిగా పేర్కొంటూ, విడుదల కోసం డిమాండ్ చేస్తున్నారంటున్నారు.
ఇప్పుడే తొందర ఎందుకు?
సాజిదా అరెస్టై పదేళ్లు అవుతోంది. ఆమె ఫేస్ కూడా చాలామంది మరిచిపోయి ఉంటారు. ఆమెకు మరణ శిక్ష విధించారు. ఆమె మరణ శిక్ష ఆలస్యమవుతోంది. ఇటీవలే ఆమె మరణ శిక్ష విధింపు పైన బ్యాన్ ఎత్తివేశారు. ఈ కారణంగానే ఐసిస్ డిమాండ్ చేస్తోంది.
మహిళా బాంబర్స్ విడుదలకు డిమాండ్
మహిళా సూసైడ్ బాంబర్లను విడుదల చేయాలని ఐసిస్ గతంలోను డిమాండ్ చేసింది. ఆఫియా సిద్ధిఖి అలియాస్ లేడీ అల్ ఖైదాను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఆమెను విడుదల చేస్తే అమెరికా జర్నలిస్టు జేమ్స్ ఫోలేను విడుదల చేస్తామని హెచ్చరించింది. ఆమెను అప్పగించేందుకు అంగీకరించకపోవడంతో జర్నలిస్టును చంపేశారు.