పాత బ్యాటరీల్లో దాగిన లోహ సంపద - రష్యా నుంచి సరఫరా తగ్గడంతో రీసైక్లింగే పరిష్కారమా
మీరు కారు కొనుక్కోవాలని అనుకుంటున్నారా? పర్యావరణ హితంగా ఉండే ఎలక్ట్రిక్ కారు కొనాలని అనుకుంటున్నారా?
కానీ, ఎలక్ట్రిక్ వాహనాల ఖరీదు మాత్రం మీకు అందుబాటులో ఉండకపోవచ్చు.
ఎందుకని అనుకుంటున్నారా?
రానున్న కొన్నేళ్లలో ప్రపంచంలో లక్షలాది మంది ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలు కొంటారు. ఈ కార్లు, ట్రక్కులు బ్యాటరీలతో నడుస్తాయి. ఈ బ్యాటరీల తయారీకి కోబాల్ట్, లిథియం, నికెల్ అవసరం.
వీటి తయారీకి అవసరమైన లోహాలు తగినంత స్థాయిలో దొరుకుతున్నాయా?
ఈ లోహాల కొరత ఎలక్ట్రిక్ వాహనాల జోరుకు అడ్డుకట్ట వేయొచ్చు.
"ప్రస్తుతానికి ఈ కీలకమైన లోహాల మైనింగ్ తగినంత స్థాయిలో జరగడం లేదని చాలా మందికి తెలియదు" అని బ్యాటరీల మైనింగ్, రీసైక్లింగ్ సంస్థ ఎన్టీహెచ్ సైకిల్ సహ వ్యవస్థాపకులు మేగన్ ఓ కానర్ చెప్పారు.
పాత బ్యాటరీల నుంచి నికెల్, ఇతర లోహాలను వెలికి తీసేందుకు అవసరమైన విధానాన్ని ఈ సంస్థ రూపొందించింది. దీంతో, వీటిని తిరిగి వాడడం వీలవుతుంది.
ఈ విధానాన్ని ఎలక్ట్రో ఎక్స్ట్రాక్షన్ అని అంటారు.
'బ్లాక్ మాస్’గా పిలిచే బ్యాటరీ వ్యర్థాల నుంచి లోహాలను వేరు చేసేందుకు విద్యుత్ ప్రవాహాన్ని వాడుతారు. ఇలా వేరు చేసిన లోహాలను ఒక ప్రత్యేక ఫిల్టర్లోకి తీసి ఉంచుతారు.
ఎన్టీహెచ్ సైకిల్ సంస్థ పాత బ్యాటరీల నుంచి మాత్రమే కాకుండా గనుల నుంచి తీసిన రాయి, లోహాల నుంచి కూడా నికెల్ను వెలికితీస్తుంది.
సంప్రదాయ పద్ధతిలో వెలికితీసే పైరోమెటలర్జీ విధానం కంటే ఈ విధానాన్ని ఉపయోగించి నికెల్ను వెలికితీయడం మరింత సుస్థిరమైన పద్ధతి అని డాక్టర్ ఓ కానర్ అన్నారు. పైరోమెటలర్జీ పర్యావరణ హితమైన విధానం కాదని అన్నారు.
- అమెజాన్ 'బంగారు నదుల' గుట్టు బయటపెట్టిన నాసా ఫొటోలు
- బంగారం స్మగ్లింగ్లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
{image-_124220728_megano'connor-credit-nthcycle.jpg telugu.oneindia.com}
"భారీ కొలిమిలో ప్రతి వస్తువును అత్యధిక ఉష్ణోగ్రతల్లో కరిగిస్తారు. దీని వల్ల విడుదలయ్యే కార్బన్ ఫుట్ప్రింట్ను మీరు ఊహించుకోవచ్చు" అని వివరించారు.
రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమకు మరింత నికెల్ సరఫరా అవసరమవుతుంది.
నిత్య జీవితంలో ఉపయోగించే చాలా ఉత్పత్తుల్లో నికెల్ ఉంటుంది.
లిథియం అయాన్ బ్యాటరీలు చాలా పరికరాలకు శక్తిని సమకూరుస్తాయి. మనం వాడే ఫోన్లలో కూడా ఈ బ్యాటరీలే ఉంటాయి.
ఈ బ్యాటరీలు నికెల్, మాంగనీస్, కోబాల్ట్ మిశ్రమంపై ఆధారపడతాయి.
కానీ, కొన్ని బ్యాటరీల్లో 80 శాతం నికెల్ ఉంటుంది.
కానీ, యుక్రెయిన్లో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం ప్రభావం నికెల్ను సమకూర్చుకోవడంపై కూడా పడింది. రష్యా ప్రపంచంలోనే అధిక స్థాయిలో నికెల్ సరఫరా చేస్తోంది.
ఇండోనేసియా, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలు తమ దేశంలో నికెల్ ఉత్పత్తిని పెంచే అవకాశముంది. అయితే, వీరెంత కాలం ఈ ఉత్పత్తిని పెంచగలరనే ప్రశ్న కూడా ఉంది.
- నాణ్యమైన బంగారు గనుల్లో కంటే మిన్నగా.. టన్ను మొబైల్ వ్యర్థాల్లో 300 రెట్లు బంగారం...
- బంగారం గొలుసు మింగేసిన ఆవు.. పేడలో వెతికినా దొరకలేదు.. ఏం చేశారంటే..
"నికెల్కు పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా కొత్త గనులు ఇప్పటికిప్పుడు ఉత్పత్తిని పెంచలేవు" అని డాక్టర్ ఓ కానర్ అంటారు.
నికెల్ను స్టెయిన్లెస్ స్టీల్ తయారీ, విండ్ టర్బైన్లోని భాగాల తయారీలో కూడా వాడతారు. అయితే, పాత బ్యాటరీలను రీసైకిల్ చేయడం ద్వారా కొంత వరకు నికెల్ కొరత సమస్యను నివారించవచ్చు" అని ఆమె సూచించారు.
ఇతర సంస్థలు కూడా ఇదే విధానాన్ని అవలంబించేందుకు చూస్తున్నాయి. అమెరికాలోని రెడ్ వుడ్ మెటీరియల్స్ ఏటా వాడకంలో లేని 60-80,000 వరకు వాహనాల నుంచి బ్యాటరీలను సేకరించడం ఇప్పటికే మొదలుపెట్టింది.
"బ్యాటరీల నుంచి సగటున 95% వరకు నికెల్, కోబాల్ట్, లిథియం, రాగి లోహాలను వెలికి తీస్తున్నాం" అని కమ్యూనికేషన్స్ అండ్ గవర్నమెంట్ రిలేషన్స్ అలెక్సిస్ జార్జ్ సన్ వైస్ ప్రెసిడెంట్ చెప్పారు.
కానీ, నికెల్ మార్కెట్ పై ఉన్న నమ్మకం మాత్రం తిరిగి ఏర్పడాల్సి ఉంది. ఈ ఏడాది మార్చిలో లండన్ మెటల్ ఎక్స్చేంజిలో నికెల్ ధర తగ్గడానికి ముందు 250% పెరిగింది. దాంతో, ఎల్ఎంఈ ఆపరేటర్లు ఒక వారం రోజుల పాటు నికెల్ ట్రేడింగ్ను నిలిపేశారు. ఇది ఊహించని చర్య.
నికెల్ ధర అస్థిరంగా ఉంటోంది. ఇదొక పెద్ద విపత్తు అని రామ్కో గ్రూప్లో ట్రేడింగ్ హెడ్ కీత్ వైల్డీ చెప్పారు.
ధర తగ్గినా కూడా ఈ ఏడాది మొదట్లో ఉన్న ధర కంటే కూడా 60 శాతం ఎక్కువగానే ఉంది.
దీనికంతటకీ చైనా సంస్థ సింగ్ షాన్ హోల్డింగ్ గ్రూప్ నికెల్ ధర తగ్గుతుందని బెట్ లు నిర్వహించేందుకు కొన్ని సంస్థల మధ్య ఒప్పందాలు కుదుర్చుకునేటట్లు చేయడం ఒక కారణం. ఎప్పుడైతే, నికెల్ ధర తగ్గలేదో ఈ ఒప్పందాలను తిరిగి కొనుక్కునేందుకు ఈ సంస్థ పై ఒత్తిడి పడింది. లేదా నికెల్ ను సరఫరా చేసేందుకు కట్టుబడాలి. ఏ మార్గం ఎన్నుకున్నా కూడా సంస్థకు నష్టమే.
బీబీసీ ప్రశ్నకు సంస్థ స్పందించలేదు.
- ఇరీడియం: బంగారం, ప్లాటినం కంటే ఇది ఖరీదైంది.. ఎందుకో తెలుసా..
- కేజీఎఫ్ - కోలార్ గోల్డ్ఫీల్డ్స్: టన్నుల కొద్దీ బంగారాన్ని ఇచ్చిన ఈ గనులు ఇప్పుడెందుకు మూతపడ్డాయి?
"మార్కెట్లో నెలకొన్న అస్థిరత, ఆందోళన నికెల్ వర్తకుల నమ్మకం పై దెబ్బ కొట్టింది. నికెల్ స్టాక్ కుప్పకూలిపోయింది" అని వైల్డీ అన్నారు.
ఈ పరిస్థితి గురించి విచారణ నిర్వహించమని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్తో పాటు బ్రిటన్ రెగ్యులేటరీ సంస్థ ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ కూడా ఆదేశించాయి.
"మార్కెట్ సమర్ధతకు సహకారం అందించేందుకు, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం వర్తకుల నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు ఈ మొత్తం వ్యవహారంలో పాత్రధారులందరి చర్యలను పూర్తిగా సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటాం" అని ఎల్ ఎం ఈ ఒక ప్రకటనలో పేర్కొంది.
అయితే, భవిష్యత్తులో నికెల్ సరఫరాల గురించి ఆందోళన మాత్రం కొనసాగుతోంది.
ఉదాహరణకు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే టెస్లా న్యూ కాలెడోనియాలో పసిఫిక్ దీవుల్లో ఉన్న కొత్త నికెల్ గనుల్లో సాంకేతిక భాగస్వామ్యాన్ని తీసుకుంది. దీని ద్వారా నికెల్ ను సమకూర్చుకోవాలని చూస్తోంది.
అన్ని సంస్థలు ఇదే మార్గాన్ని అవలంబించలేవు. ప్రపంచంలో మూడింట రెండు వంతుల నికెల్ ఉత్పత్తి స్టెయిన్ లెస్ స్టీల్ ఉత్పత్తికి వెళుతోంది. ఇది వంటింటి పరికరాల నుంచి, బాత్ రూమ్ కొళాయిలు, వాషింగ్ మెషీన్ల తయారీకి వెళుతోంది.
నికెల్ ధరల పెరుగుదల, సరఫరా సమస్యలతో యూరప్లో ఉన్న కొన్ని స్టెయిన్లెస్ స్టీల్ ఫ్యాక్టరీలు ఇప్పటికే తమ ఉత్పత్తిని తగ్గించాయి.
కొన్ని పరిశ్రమల్లో కొంత కాలం పాటు నికెల్ డిమాండ్ తగ్గవచ్చని ట్రేడ్ పత్రిక మెటల్ మైనర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ లీసా రీస్మన్ అంచనా వేస్తున్నారు.
"అధిక వడ్డీ రేట్ల వల్ల గృహ నిర్మాణ మార్కెట్ మందగించవచ్చు. రానున్న నెలల్లో స్టెయిన్లెస్ స్టీల్ పరికరాలను కొనే వారి సంఖ్య తగ్గొచ్చు" అని ఆమె వివరించారు.
ఎలక్ట్రిక్ కార్లకు మాత్రం నికెల్ సరఫరా నిరంతరం అవసరం అవుతుంది.
2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా లైట్ వెయిట్ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 26.8 మిలియన్కు చేరతాయని మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఎస్&పి గ్లోబల్ ప్లాట్స్ ఈ ఏడాది మొదట్లో అంచనా వేసింది. 2020 - 2021 మధ్యలో వీటి అమ్మకాలు రెండింతలు పైగా జరిగాయని సంస్థ పేర్కొంది.
- మృతదేహాలతో పాటు బంగారు కళాకృతుల్ని పాతిపెట్టిన ఈ సమాధుల చరిత్ర ఏంటి?
- అమెజాన్ అడవుల్లో రెచ్చిపోతున్న గోల్డ్ మైనర్లు... బ్రెజిల్ అధ్యక్షుడే స్మగ్లర్లకు సహకరిస్తున్నారా?
అయితే, పెరిగిన నికెల్ ధరల ప్రభావం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలపై పడకపోవచ్చని ఎస్&పి గ్లోబల్ ప్లాట్స్లో సీనియర్ విశ్లేషకులు జ్యాసన్ సాపోర్ చెప్పారు. కానీ, నికెల్ మార్కెట్ను నడిపించడంలో ఎలక్ట్రిక్ బ్యాటరీలు చాలా ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయని అన్నారు.
"పాత బ్యాటరీలను రీసైక్లింగ్ చేయడం వల్ల ఈ లోటును పూరించగలమా? కొంత వరకు చేయవచ్చేమో అని సాపోర్ అన్నారు. "కానీ, తగినన్ని పాత బ్యాటరీలను సంపాదించి వాటిలో ఉన్న అతి తక్కువ మోతాదులో ఉన్న నికెల్ ను వెలికి తీయాల్సి ఉంటుంది" అని అన్నారు.
"వాటిని రీసైకిల్ చేసేందుకు ఇప్పటికే అందుబాటులో స్టాక్ ఉండాలి" అని అన్నారు.
ఇలాంటి విధానం దీర్ఘకాలంలో పని చేస్తుందని అన్నారు.
"భవిష్యత్తులో నికెల్ డిమాండును అందుకునేందుకు కేవలం రీసైక్లింగ్ ఒక్కటే సరిపోదు. ఈ లోహాలను మరింత మైనింగ్ చేయాల్సిన అవసరం ఉంది.
అయితే, వాటిని సుస్థిర విధానాల్లో మైనింగ్ చేయాల్సి ఉంటుంది" అని డాక్టర్ ఓ కానర్ అన్నారు
ఇవి కూడా చదవండి:
- భారత్లో ఉద్యోగాల్లో మహిళలు తగ్గిపోతున్నారా? కారణాలు ఏంటి?
- ఎలాన్ మస్క్: ట్విటర్ కొత్త యజమానిని ఇబ్బందుల పాలు చేసిన ఆరు సొంత ట్వీట్లు
- ఏపీ: 'సీఎంఓ నుంచి అంటూ ఎమ్మెల్యేలకు టోకరా.. 80 లక్షలతో గాజువాకలో ప్రియురాలికి ఇల్లు’
- హీట్వేవ్: తెలంగాణకు ఎల్లో అలర్ట్.. వడదెబ్బ తగిలిందని ఎలా తెలుస్తుంది
- నాన్న ఆఫీస్కు వెళ్లాడని అమ్మ కారు తాళాలు తీసుకుని ఈ నాలుగేళ్ల పిల్లాడు ఏం చేశాడంటే..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)