Mexico earthquake: వణికిన తీర ప్రాంతాలు: సునామీ వార్నింగ్ సెంటర్ అలర్ట్
మెక్సికో సిటీ: మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. దేశ ఈశాన్య ప్రాంతంలో సంభవించిన భూప్రకంపనల తీవ్రత అంచనాలకు మించి ఉంది. భూకంప తీవ్రతకు పలు భవనాలు కంపించాయి. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. రోడ్ల మీదికి పరుగులు తీశారు. రాత్రంతా రోడ్ల మీదే జాగారం చేశారు. ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్పంగా ప్రకంపనలు సంభవించాయి. ఫలితంగా- తమ ఇళ్లల్లోకి వెళ్లడానికి ప్రజలు భయపడ్డారు. రోడ్ల మీదే నిద్రలేని రాత్రిని గడిపారు.
చైనా పక్కలో బల్లెం: అందుకే తాలిబన్లకు ఫండింగ్: ఏం జరుగుతుందో వేచి చూద్దాం: జో బైడెన్
మెక్సికో ఈశాన్య ప్రాంతంలోని గుయెర్రెరో స్టేట్లో ఈ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.4గా రికార్డయింది. గుయెర్రెరో.. తీర ప్రాంత రాష్ట్రం కావడంతో సునామీ సంభవిస్తుందనే భయాందోళనలు తొలుత వ్యక్తం అయ్యాయి. అమెరికాలోని సునామీ వార్నింగ్ సెంటర్ దీనికి సంబంధించిన హెచ్చరికలను కూడా జారీ చేసింది. అనంతరం దాన్ని ఉపసంహరించుకుంది. గుయెర్రెరో సమీపంలోని అకపల్కో తీర ప్రాంత నగరాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. గుయెర్రెరోకు ఈశాన్య దిశగా 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ నగరం.
తీర ప్రాంత నగరం కావడం వల్ల సునామీ విరచుకుపడే ప్రమాదం ఉందంటూ అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. కొద్దిసేపటి తరువాత ఆ హెచ్చరికలను వెనక్కి తీసుకుంది. భూకంప తీవ్రత గుయెర్రెరో స్టేట్లోని అనేక ప్రాంతాలపై పడింది. జనం 7.4 తీవ్రతతో కూడుకున్నది కావడం వల్ల ప్రజలు దాని ప్రభావాన్ని స్పష్టంగా చవి చూశారు. ఇళ్లల్లో నుంచి రోడ్ల మీదికి పరుగులు తీశారు. పలు భవనాల కిటికీ అద్దాలు పగిలిపోయాయి. కొన్ని భవనాలు బీటలువారాయి.
ప్రధాన భూకంపం తరువాత.. కూడా ప్రకంపనలు సంభవించాయి. దాని తీవ్రత పెద్దగా లేకపోయినప్పటికీ- ప్రజలు మాత్రం ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడ్డారు. కొన్ని గంటల పాటు రోడ్ల మీదే కనిపించారు. అకపల్కో సిటీలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం సైతం ఏర్పడింది. అనేక ప్రాంతాలు అంధకారమయం అయ్యాయి. కొన్ని చోట్ల కొండచరియలు సైతం విరిగిపడ్డాయి. ఫలితంగా- రోడ్లు ధ్వంసం అయ్యాయి.
Recommended Video
రాజధాని మెక్సికో సిటీలోనూ భూకంప తీవ్రత కనిపించింది. ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం ఇంకా అందలేదని మెక్సికో సిటీ మేయర్ క్లాడియా షెన్బామ్ చెప్పారు. అదే సమయలో మెక్సికో సిటీ సమీపంలోని రోమా సుర్ ప్రాంతంలో భారీ వర్షం కురవడం వల్ల ప్రజలు మరింత గందరగోళానికి, భయాందోళనలకు గురయ్యారు. ఎటు వెళ్లాలో తెలియక రోడ్ల మీద, చెట్ల కింద బిక్కుబిక్కుమంటు గడిపారు.