దండం రా దూత..!!
Microsoft: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొమ్ములు తిరిగిన కంపెనీలు కూడా దీని బారిన పడుతున్నాయి. భారీగా ఉద్యోగాల్లో కోత పెడుతున్నాయి. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్.. వంటి సంస్థలు సైతం ఇదివరకే దశలవారీగా లేఆఫ్స్ ప్రకటించాయి.
మైక్రోసాఫ్ట్ సైతం దీనికి మినహాయింపేమీ కాదు. దాదాపుగా 15,000 మంది ఉద్యోగులను తొలగించిందా టెక్ దిగ్గజం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను మళ్లిస్తోంది. మ్యాన్ పవర్ కంటే కూడా AI ని గట్టిగా నమ్ముకుందా సంస్థ.

ఈ పరిస్థితుల మధ్య మైక్రోసాఫ్ట్ మరో ప్రధాన నిర్ణయాన్ని తీసుకుంది. ఉద్యోగుల ఆఫీస్ టైమింగ్స్ ను మరింత కఠినతరం చేయనుంది. 'రిటర్న్ టు ఆఫీస్' (RTO) పాలసీని మరంత టైట్ చేయనుంది. ఇందులో భాగంగా టఫ్ అటెండెన్స్ పాలసీని అమలు చేయాలని యోచిస్తోంది.
ప్రస్తుత హైబ్రిడ్ వర్కింగ్ మోడల్ ను అమలు చేస్తోంది మైక్రోసాఫ్ట్. వర్క్ ఫ్రమ్ హోమ్ సహా ఉద్యోగులు ఎక్కడి నుంచైనా లాగిన్ అవ్వొచ్చు. తమ టీమ్ లీడ్ లేదా డివిజన్ మేనేజర్ నుంచి ముందస్తు అనుమతి లేకుండా 50 శాతం వర్కింగ్ అవర్స్ రిమోట్గా పనిచేయడానికి అవకాశం ఉంది. దీనివల్ల కొంత లూప్ ఏర్పడుతోందని సంస్థ యాజమాన్యి భావిస్తోంది.
దీన్ని నివారించడానికి రిటర్న్ టు ఆఫీస్, టఫ్ అటెండెన్స్ విధానాలపై కసరత్తు చేపట్టింది. బిజినెస్ ఇన్సైడర్ కథనం ప్రకారం.. వారానికి కనీసం మూడు రోజులు ఉద్యోగులు ఆఫీసు నుండి పనిచేయడాన్ని తప్పనిసరి చేసే కొత్త పాలసీని మైక్రోసాఫ్ట్ అమలు చేయబోతోంది.
ఇది- 2026 జనవరి నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. రిటర్న్ టు ఆఫీస్ విధానంలో కొన్ని ప్రాజెక్టులు/డివిజన్లల్లో పని చేసే ఉద్యోగులకు మినహాయింపు లభించే అవకాశాలు లేకపోలేదని బిజినెస్ ఇన్ సైడర్ తెలిపింది. వర్కింగ్ గైడ్ లైన్స్ ను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా అప్డేట్ చేయాలనే అంశంపై చర్చిస్తోన్నామని మైక్రోసాఫ్ట్ హెడ్ బిజినెస్ ఇన్సైడర్కు తెలిపారు.
రిటర్న్ టు ఆఫీస్ పాలసీని తాము అమలు చేయబోమంటూ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుత అవసరాలు, భారీగా ఉద్యోగుల తొలగింపు, లేఆఫ్స్.. వంటి పరిస్థితుల్లో దీన్ని అప్ డేట్ చేయాలని భావిస్తోన్నట్లు ఆయన చెప్పారు. ఈ మార్పుతో మైక్రోసాఫ్ట్ ఇప్పుడు అమెజాన్, డెల్, గూగుల్ వంటి ఇతర పెద్ద టెక్ కంపెనీల సరసన చేరినట్టవుతుంది.












Click it and Unblock the Notifications