భారత్కు ప్రతిగా..: క్షిపణి విఫల ప్రయోగంతో పరువు తీసుకున్న పాకిస్థాన్!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మరోసారి తన పరువును తానే తీసుకుంది. భారత రక్షణ శాఖకు చెందిన క్షిపణి ఒకటి ఇటీవల పొరపాటుగా పాకిస్థాన్ భూభాగంలో పడింది. ఈ విషయాన్ని భారత్ పాకిస్థాన్కు తెలిపింది. అయితే, పాకిస్థాన్ మాత్రం భారత్తో విభేదిస్తూ తదుపరి చర్యలకు దిగింది. తన సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు తాజాగా ఓ క్షిపణి ప్రయోగం చేపట్టగా.. అది కాస్తా విఫలమవడంతో పాకిస్థాప్ పరువు పోయింది. ఈ మేరకు పాక్ స్థానిక మీడియాల్లోనే కథనాలు రావడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్లోని జంషోర్ ప్రాంతంలో గురువారం ఓ గుర్తు తెలియని వస్తువు గాల్లోకి ఎగిరి.. కిందపడటాన్ని స్థానికులు గుర్తించారు. ఆ వస్తువు క్షిపణి అని తర్వాత తేలింది. పాకిస్థాన్ ప్రయోగించిన క్షిపణి విఫలమైందని ఆ దేశ మీడియా ఛానళ్లు ప్రసారం చేశాయి. వాటి కథనాల ప్రకారం.. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో సింధ్ లోని టెస్ట్ రేంజ్ నుంచి ఓ క్షిపణి ప్రయోగం చేపట్టింది.
అయితే, ట్రాన్స్పోర్టర్ ఎరెక్టర్ లాంఛర్లో సమస్య కారణంగా ఈ ప్రయోగాన్ని గంటలపాటు వాయిదా వేశారు. ఆ తర్వాత 12 గంటల ప్రాంతంలో క్షిపణి గాల్లోకి లేచింది. కానీ, కొద్ది సెకన్ల వ్యవధిలోనే ఆ మిసైల్ తన లక్షిత మార్గం నుంచి తప్పిపోయి.. వెంటనే కుప్పకూలింది. పాకిస్థాన్ లోని కొన్ని మీడియా ఛానళ్లు ఈ ఘటనను ప్రసారం చేశాయి. అయితే, పాక్ ప్రభుత్వం నుంచి మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు.
అది క్షిపణి కాదని, సాధారణ మోర్టార్ ట్రేసర్ రౌండ్ అని స్థానిక అధికారులు కొందరు చెప్పినట్లు తెలిసింది. దీనిపై పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారట. అయితే, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మీడియాలో లేనిపోని కథనాలు వస్తున్నాయని పాకిస్థాన్ రక్షణ శాఖ విశ్లేషకులు తెలిపారు. క్షిపణి రేంజ్ తెలుసుకునేందుకు బలగాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. దానికి సంబంధించి ముందు జాగ్రత్త చర్యలనూ జారీ చేశామని తెలిపారు. కాగా, ఇటీవల చోటు చేసుకున్న భారత క్షిపణి ఘటనకు ప్రతిస్పందనగానే పాకిస్థాన్ ఈ ప్రయోగం చేపట్టి తన పరువును పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది.