దారి మళ్లించారా?: మలేషియా విమానంపై వీడని మిస్టరీ
కౌలాలంపూర్: గల్లంతైన మలేషియా ఎయిర్ లైన్స్ విమానం మిస్టరీ వీడటం లేదు. విమానాన్ని ఉద్దేశపూర్వకంగానే దారి మళ్లించి, మధ్య ఆసియా దిశగా లేదా దక్షిణ హిందూమహాసముద్రం వైపు గాని తీసుకు వెళ్లి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. దీని వెనుక మాన ప్రమేయంతో పాటు, హైజాక్కు గురైందున్న అనుమానాలు బలపడుతున్నాయి. బంగాళాఖాతం, హిందూమహాసముద్రంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు.
మలేసియా ఎయిర్లైన్స్ విమానం బంగాళాఖాతంలో కానీ, హిందూ మహాసముద్రంలో కానీ కూలిపోయి ఉండొచ్చని అమెరికా న్యూస్ చానల్ సిఎన్ఎన్ శనివారం వెల్లడించింది. 329 మందితో ప్రయాణిస్తున్న జెట్ విమానం ఉద్దేశపూర్వక చర్య కారణంగా దారి మళ్లిందని ఫైట్ డేటా చెప్తోందని మలేసియా ప్రధానమంత్రి ధ్రువీకరించిన కొద్ది గంటలకే సిఎన్ఎస్ ఈ విషయం వెల్లడించడం విశేషం.
విమానం బంగాళాఖాతం లేదా హిందూ మహాసముద్రంలో ఎక్కడో ఒకచోట కూలిపోయి ఉండవచ్చని ఎలక్ట్రానిక్, శాటిలైట్ డేటాల విశ్లేషణలు సూచించినట్టు సిఎన్ఎన్కు విశ్వసనీయ సమాచారం అని చానల్ పేర్కొంది. ఈ ప్రాంతాలకు చెందిన కొన్నిచోట్ల గాలింపులు జరిపినట్టు మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ సైతం చెప్పిన విషయాన్ని ఆ చానల్ గుర్తు చేసింది.
విమానం సివిలియన్ రాడార్ నుంచి అదృశ్యమైన తర్వాత దాని ఎత్తు, దిశల్లో తీవ్రమైన మార్పులు చోటు చేసుకున్నట్టు నజీబ్ ప్రకటన వెలువడడానికి ముందు అమెరికా అధికారులు చెప్పారు. ఈ మార్పులు విమానం కంట్రోల్స్ వద్ద పైలట్ కాకుండా మరెవరైనా ఉన్నారా? అనే అనుమానాలకు తావిస్తున్నాయని ఆ ఛానల్ తెలిపింది. అంతేకాదు, దీన్ని బట్టి విమానం అదృశ్యం వెనుక ఏదోఒక రకమైన మానవ జోక్యం ఉండి ఉండొచ్చన్న వాదనలను తోసిపుచ్చడం కష్టమని దర్యాప్తు గురించి బాగా తెలిసిన అధికారి ఒకరు చెప్పినట్టు సిఎన్ఎన్ కథనం పేర్కొంది.
మలేసియా అధికారులు విమానంలోని సిబ్బంది, ప్రయాణికులపై తిరిగి దృష్టి పెట్టారని ప్రధాని శనివారం విలేఖరులకు చెప్పారు. విమానం లోపలి నుంచి ఎవరో ఉద్దేశపూర్వకంగా ఈ చర్యలకు పాల్పడినట్టు సాక్ష్యాధారాలు సైతం చెప్తున్నాయని ఆయన అన్నారు. అయితే దీన్ని హైజాక్గా పేర్కొనడానికి ఆయన నిరాకరిస్తూ, దర్యాప్తు అధికారులు ఈమేరకు తుది నిర్ణయం చేయలేదన్నారు.
వీటన్నిటినీ బట్టి చూస్తే ఏదోఒక అంతుచిక్కని అవసరం కోసం ఎవరో విమానాన్ని తమ అధీనంలోకి తీసుకుని ఉండొచ్చన్న అనుమానాలను ఈ డేటా ఎత్తి చూపిస్తోందని అమెరికా దర్యాప్తు అధికారులు చెప్పినట్టు సిఎన్ఎన్ తెలిపింది. కాగా, బంగాళాఖాతంలో నౌకాదళం, కోస్ట్గార్డుకు చెందిన అదనపు యుద్ధ నౌకలను, విమానాలను రంగంలోకి దించడం ద్వారా అదృశ్యమైన మలేసియా ఎయిర్లైన్స్ కోసం గాలింపును తీవ్రం చేసినట్టు, అయితే ఇప్పటి వరకు విమానం జాడ తెలియరాలేదని భారత నౌకాదళం శనివారం తెలియజేసింది.