రేపు ఇస్లామాబాద్లో మూగబోనున్న ఫోన్లు!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాడు ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్ నగరంలో మొబైల్ ఫోన్ సర్వీసులను నిలిపివేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇస్లామాబాద్లో సెల్ ఫోన్లేవీ పనిచేయవని అక్కడి హోం మంత్రిత్వశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఈ విషయాన్ని జియో న్యూస్ ప్రకటించింది. రాజధాని నగరంలో జరిగే స్వాతంత్ర్య దిన సంబరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని.. ముందు జాగ్రత్త చర్యగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
గురువారం కూడా రిహార్సల్స్ కారణంగా ఉదయం నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మొబైల్ సర్వీసులను సస్పెండ్ చేశారు.
ఖాట్మండ్లో స్వల్ప భూకంపం
నేపాల్ రాజధాని ఖాట్మండ్లో గురువారం స్వల్పంగా భూమి కంపించింది. ఉదయం సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్స్కేల్పై 4పాయింట్లుగా నమోదైంది. భూకంపం రావడంతో స్థానికులు భయాందోళనతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.
భూకంప కేంద్రం ఖాట్మండ్లో ఉన్నట్టు భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా, ఏప్రీల్ 25న సంభవించిన భారీ భూకంపం తర్వాత ఇప్పటి వరకు 476సార్లు భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఆనాటి భూకంపంలో సుమారు 9 వేల మందికిపైగా మృతిచెందిన విషయం తెలిసిందే.