‘వనా క్రై’ దాడికి అమెరికాయే కారణం, వికిలీక్స్ ముందే చెప్పింది.. మండిపడిన మైక్రోసాఫ్ట్
సైబర్ దాడికి అమెరికా ప్రభుత్వమే కారణమంటూ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మండిపడింది.
వాషింగ్టన్ : శుక్రవారం నాటి 'వనా క్రై' ర్యాన్సమ్ వేర్ సైబర్ దాడితో ఒక్కసారిగా ప్రపంచ దేశాలన్నీ హడలిపోయాయి. కారు సంస్థలు, ఆసుపత్రులు, పాఠశాలలు, దుకాణాల్లో ఇది బీభత్సం సృష్టించింది. సోమవారం కూడా ఇది పంజా విసరనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే ఈ సైబర్ దాడికి అమెరికా ప్రభుత్వమే కారణమంటూ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మండిపడింది. ర్యాన్సమ్ వేర్ అటాక్ చేసిన హ్యాకింగ్ టూల్, అమెరికా కేంద్ర నిఘా సంస్థ రూపొందించిందేనని, దీన్ని ఏప్రిల్ లో ఆన్ లైన్ లీక్ చేసినట్టు మైక్రోసాప్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ తన బ్లాగ్ పోస్టులో పేర్కొన్నారు.
వార్నింగ్!: నేడు మరో సైబర్ దాడి? ఆర్బీఐ, ఆధార్లను అప్రమత్తం చేసిన ప్రభుత్వం
రీసెర్చర్లు కూడా ఈ విషయాన్ని స్పష్టీకరించారంటూ అమెరికా ప్రభుత్వ సాఫ్ట్ వేర్ ల దుర్భలత్వాన్ని బ్రాడ్ స్మిత్ ఎత్తిచూపారు. అమెరికా కేంద్ర నిఘా సంస్థ వేలకొద్దీ హ్యాకింగ్ టూల్స్ ను అభివృద్ధి చేసి, వాటితో ప్రతి ఒక్కరిపైనా నిఘా ఉంచుతుందని గతంలోనే వికిలీక్స్ చెప్పిందని, ప్రస్తుతం జరిగిన దాడితో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంస్థలు, వినియోగదారులు బలవాల్సి వచ్చిందని ఆయన వాపోయారు.
కనీసం ఇటీవలి సైబర్ దాడితోనైనా అమెరికా ప్రభుత్వం మేల్కోవాలని, ప్రజలకు జరిగిన నష్టాన్ని పరిగణలోకి తీసుకోవాలని బ్రాడ్ స్మిత్ వ్యాఖ్యానించారున. అయితే మైక్రోసాఫ్ట్ చేసిన కామెంట్లపై ఎన్ఎస్ఏ కాని, వైట్ హౌస్ కాని ఇప్పటివరకు స్పందించలేదు.
సైబర్ దాడికి గురైన చాలా సిస్టమ్స్ బ్యాకప్స్ తో రికవరీ అవుతున్నాయని స్కాట్ బోర్గ్ చెప్పారు. ఈ దాడిపై శుక్రవారం రాత్రి తమ హోమ్ లాండ్ సెక్యురిటీ అడ్వయిజర్ తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు.