8మంది చిన్నారుల హత్య కేసు: తల్లి అరెస్ట్
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని కెయిర్న్ నగరంలో 8మంది చిన్నారులను ఆయుధాలతో పొడిచి చంపేసిన ఘటనలో వారి తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లలంతా 18 నెలల నుంచి 14 ఏళ్లలోపువారే. వాళ్లను చంపేందుకు ఆమెకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హత్యాస్థలం వద్ద టెడ్డీబేర్లు, పువ్వులు పడివున్నాయి. పిల్లల్లో ఏడుగురు ఆమె కన్న బిడ్డలే కాగా, ఎనిమిది చిన్నారికి ఆమె సమీప బంధువు. నిందితులైన 37ఏళ్ల మహిళను అరెస్ట్ చేసి, ప్రస్తుతం పోలీసుల భద్రతలో కెయిర్న్ బేస్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బ్రూనో ఆస్నికర్ తెలిపారు.
ప్రస్తుతానికి ఆమె మీద తప్ప వేరెవ్వరి మీద అనుమానాలు లేవని, ఆ ప్రాంతం అంతా సురక్షితంగానే ఉందని చెప్పారు. శుక్రవారం జరిగిన 8మంది చిన్నారుల హత్యలు ఆస్ట్రేలియాను దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఆ దేశ అధ్యక్షుడు టోనీ అబ్బాట్ కూడా ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
శుక్రవారం జరిగిన హత్యలకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కెయిర్న్స్ పట్టణంలోని ఓ ఇంటి ఆవరణలో ఒక మహిళ గాయపడి ఉన్నట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మహిళను ఆస్పత్రికి తరలించి ఇంటిని శోధించగా 8 మంది పిల్లల మృతదేహాల లభ్యమయ్యాయి. మృతదేహాలను చూసిన పోలీసులు ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు.
గాయపడిన 35ఏళ్ల మహిళకు చికిత్స అందిస్తున్నామని, ఆమె తమ విచారణకు సహకరిస్తోందని పోలీసులు చెప్పారు. పిల్లలపై పదునైన ఆయుధంతో దాడి జరిగినట్లు గాయాలను బట్టి తెలుస్తోందని చెప్పారు.