పాక్ వచ్చే ఎన్నికల్లో ముంబై దాడుల సూత్రధారి, ఉగ్రవాది హఫీజ్ పోటీ
లాహోర్: ముంబై పేలుళ్ల సూత్రధారి, లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థల చీఫ్ హఫీజ్ సయీద్ పాకిస్థాన్ ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు. భారత్, అమెరికాల ఒత్తిడితో గత జనవరి 21న అరెస్టయి పది నెలల పాటు గృహనిర్బంధంలో ఉన్న హఫీజ్ సయీద్ నవంబర్ 24న విడుదలయ్యాడు.
అనంతరం పాకిస్థాన్ను ఏకం చేసి, కాశ్మీర్పై పోరాటం చేస్తానని ప్రకటించాడు. తాజాగా 2018 పాకిస్థాన్ సాధారణ ఎన్నికల్లో పోటీ చేయనున్నానని ప్రకటించాడు. మిలి ముస్లిం లీగ్ (ఎంఎంఎల్) పార్టీ తరపున పోటీ చేయనున్నట్టు తెలిపాడు.
ఏ నియోజకవర్గం నుంచి అన్నది వెల్లడించలేదు. ఆగస్టులో జేయూడీ ఎంఎంఎల్ పార్టీని స్థాపించి సైఫుల్లా ఖలీద్ని పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించింది. పాకిస్థాన్ను ఎంఎంఎల్ నిజమైన ఇస్లామిక్ దేశంగా మారుస్తుందని అప్పట్లో ఖలీద్ ప్రకటించారు.కాగా, హఫీజ్ సయీద్ ను విడుదల చేయడంపై భారత్, అమెరికాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.