ముస్లిం ఇమాంలు ఔట్: కంటతడి పెట్టిన మడోన్నా
పారిస్: ఐసీస్ ఉగ్రవాదులకు ఫ్రాన్స్లో ఉన్న ముస్లింలు సహకరిస్తున్నారని తేలడంతో రాడికల్ ముస్లిం ఇమాంలను బహిష్కరించనున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. దీనిపై ఫ్రాన్స్ ఇంటీరియర్ మినిస్టర్ సోమవారం మాట్లాడుతూ ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్నవారిని, ప్రేరేపిస్తున్నవారిని దేశ బహిష్కరణ చేస్తామన్నారు.
పారిస్లో గత శుక్రవారం జిహాదీ ఉగ్రవాదులు నరమేధం నేపథ్యంలో ఫ్రాన్స్ పోలీసులు 168 చోట్ల దాడులు జరిపారు. 104 మందిని గృహ నిర్బంధంలో ఉంచారు. ఫ్రాన్స్లోని కొంత మంది ముస్లింలు ఉగ్రవాదులకు సహకరిస్తున్నారని పోలీసులు దర్యాప్తులో తేలడంతో ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఫ్రాన్స్లో పెద్ద సంఖ్యలో ముస్లిం జనాభా కూడా ఉన్నారు. పారిస్లో జరిగిన నరమేధంలో 129 మంది అమాయక పౌరులు మృతిచెందగా, 350 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 99 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ప్రముఖ పాప్ గాయని మడోన్నా పారిస్ దాడులపై స్పందిస్తూ కంటతడి పెట్టింది.
స్వీడన్లోని స్టాక్హోమ్లో శనివారం ఓ మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించిన మడోన్నా ఈ సందర్భంగా పారిస్ దాడిలో చనిపోయిన వారికోసం కొంతసేపు మౌనం పాటించింది. మృతుల గురించి మాట్లాడుతూ కన్నీరుమున్నీరుగా విలపించింది.
మడోన్నా మాట్లాడుతూ ఇప్పుడు ఈ షో నిర్వహించడం చాలా కష్టంగా ఉందన్నారు. గత రాత్రి ఏం జరిగిందో ఎవరూ మరిచిపోలేదన్నారు. పారిస్లో జరిగిన నరమేధంలో ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిశాయన్నారు. ఒకవైపు తమవారిని కోల్పోయి బాధితులు బాధలో ఉన్నారన్నారు.
అయినా సరే నేను ఇక్కడ ఎందుకు డాన్స్ చేస్తున్నానంటే, దాడులు చేసిన వారి నోళ్లు మూయించడానికేనన్నారు. ఈ సందర్భంగా విషాదస్మృతి గీతమైన 'లైక్ ఏ ప్రేయర్' గీతాన్ని ఆలపించి.. మడోన్నా పారిస్ పేలుళ్ల మృతులకు నివాళులర్పించింది.