2024 ఎన్నికల్లో పోటీకి ప్లాన్: అధ్యక్షుడిగా మళ్లీ నేనే: వంద రోజుల్లోపే..టార్గెట్ సెట్: బిడెన్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బిడెన్.. తొలిసారిగా మీడియా ముందుకొచ్చారు. ప్రమాణ స్వీకారం చేసి 59 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తన అధికారిక నివాసం వైట్హౌస్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కొన్ని కీలక లక్ష్యాలను నిర్దేశించారు. తన తొలి వంద రోజుల పరిపాలన పూర్తయ్యే సరికి చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి వివరించారు. ఆ దిశగా అధికార యంత్రాంగం యావత్తూ కృషి చేయాల్సి ఉంటుందని ఆదేశించారు.
ప్రత్యేకించి- తొలి వంద రోజుల పాలన ముగిసే సమయానికి 200 మిలియన్ల డోసుల కరోనా వైరస్ వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెప్పారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు జో బిడెన్ తెలిపారు. ప్రస్తుతానికి ఇది తన ఆలోచన మాత్రమేనని, దాన్ని అమలు చేయడానికి ఇంకా చాలా సమయం ఉందని అన్నారు. మరోసారి ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నానని చెప్పారు.

తాను ఖచ్చితంగా పోటీ చేస్తానా? లేదా? అనే విషయంపై చర్చించడానికి ఇంకా చాలా సమయం ఉందని విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నానని వివరించారు. ప్రస్తుతం బిడెన్ వయస్సు 78 సంవత్సరాలు. 2024 ఎన్నికల నాటికి ఆయన వయస్సు సహకరిస్తుందా అనే అనుమానాలు లేకపోలేదు. కాగా- తన తొలి వంద రోజుల పరిపాలన పూర్తయ్యే నాటికి దేశవ్యాప్తంగా 200 మిలియన్ల డోసుల మేర కరోనా వ్యాక్సిన్లను వేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు బిడెన్ తెలిపారు.
వంద రోజుల్లోపల కరోనా వైరస్ను నియంత్రించగలమంటూ ఇదివరకు తాను చెప్పిన మాట మీద నమ్మకం ఉంచి ప్రజలు కోవిడ్ ప్రొటోకాల్ను పాటిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే వంద మిలియన్ల మేర కరోనా టీకాలను వేశామని, దీన్ని డబుల్ చేశామని అన్నారు. కష్టసాధ్యమే అయినప్పటికీ.. ఈ లక్ష్యాన్ని అందుకోగలమని బిడెన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. రోజూ సగటున రెండున్నర మిలియన్ల మేర వ్యాక్సిన్లను వేస్తున్నారు.
దీన్ని రెట్టింపు చేయాలని బిడెన్ తాజాగా ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయడానికి జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ను 200 మిలియన్ల డోసుల మేర కొనుగోలు చేయనుంది. అలాగే- ఫైజర్, మోడెర్నా నుంచి 600 మిలియన్ల డోసుల మేర వ్యాక్సిన్ను కొనుగోలు చేయడానికి అవసరమైన చర్యలను పూర్తి చేసింది. దశలవారీగా ఈ వ్యాక్సిన్ అందుతుంది. ప్రస్తుతం అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉంటోంది. 3,07,74,033 పాజిటివ్ కేసులక్కడ నమోదయ్యాయి. 5,59,744 మంది మరణించారు.












Click it and Unblock the Notifications