భయపెడుతున్న 'మిస్టరీ?': వాళ్లిద్దరూ ఏమయ్యారు?, కిమ్ మరో సీక్రెట్ ప్లాన్!
మరో అణు క్షిపణి తయారీలో నిమగ్నమైనందువల్లే వీరిద్దరు బయటకు రావట్లేదన్న ఊహాగానాలు జోరందుకున్నాయి.
ప్యోంగ్యాంగ్: ఉత్తరకొరియా కదలికలను అంతర్జాతీయ సమాజం నిశితంగా గమనిస్తున్న సందర్భమిది. అగ్రరాజ్యం అమెరికాకే వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్.. ప్రపంచం మీద ఎప్పుడు ఉరిమిపడుతాడో తెలియని పరిస్థితి.
అణు క్షిపణుల ప్రయోగాలతో మూడో ప్రపంచ యుద్ద వాతావారణాన్ని తలపించేట్టు చేస్తున్న కిమ్.. అంతర్గతంగా అనుసరిస్తున్న వ్యూహాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. తాను శక్తివంతుడినని ప్రపంచం గుర్తించేందుకే దుందుడుకు వైఖరిని అవలంభిస్తున్నాడా?.. లేక అమెరికాపై ఆధిపత్యం చలాయిస్తే.. ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకోవచ్చునని భావిస్తున్నాడా? అన్నది అంతుచిక్కడం లేదు.
ఇలాంటి తరుణంలో ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా అదృశ్యమైపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. వీరిద్దరు రహస్యంగా అణుక్షిపణి తయారీలో పాలుపంచుకుంటున్నారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఎవరా ఇద్దరు?, రహస్య ప్లాన్?:
ఉత్తరకొరియా అణు ప్రయోగాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న రి మాన్-గోన్, రాక్-గ్యోమ్ గత కొద్దిరోజులుగా అదృశ్యమైపోయారు. ప్రభుత్వ వేడుకల్లో ఎప్పుడూ కిమ్ పక్కనే కనిపించే వీరిద్దరు.. హఠాత్తుగా మాయమైపోవడం వెనుక కారణం అంతుపట్టడం లేదు. అయితే మరో అణు క్షిపణి తయారీలో నిమగ్నమైనందువల్లే వీరిద్దరు బయటకు రావట్లేదన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇదంతా కిమ్ అమలు చేస్తున్న రహస్య ప్లాన్లో భాగమేనన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

వర్కర్స్ పార్టీ ర్యాలీలో కనిపించలేదు:
అక్టోబర్ 10న కిమ్ జాంగ్-ఉన్ నేతృత్వం వహిస్తున్న వర్కర్స్ పార్టీ వేడుకలు రాజధాని ప్యోంగ్ యాంగ్ లో ఘనంగా జరిగాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ వేడుకలకు న్యూక్లియర్&మిస్సైల్ డిపార్ట్ మెంట్ సూపర్ వైజర్ రి మాన్-గోన్ గైర్హాజరయ్యారు. ఆయనతో పాటు స్ట్రాటజిక్ రాకెట్ ఫోర్సెస్ చీఫ్ కిమ్ రాక్-గ్యోమ్ కూడా హాజరుకాలేదు. దీంతో వీరిద్దరి అదృశ్యం వెనుక కారణమేంటా? అన్న ఆరా మొదలైంది. దక్షిణ కొరియా పత్రిక 'చోసన్' ఈ వివరాలు వెల్లడించింది.

తొలగించబడ్డారా? లేక..:
ఉత్తరకొరియా ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఓ సంస్థ సభ్యుడు మాత్రం వారిద్దరిని తొలగించి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ఇటీవలి అణు ప్రయోగాలు విఫలమైనందువల్ల వీరిద్దరిని అధ్యక్షుడు కిమ్ తప్పించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. ఇక మరో వ్యక్తి మాత్రం 'వారిద్దరు ఏదో కీలక బాధ్యతలను నిర్వర్తించే పనిలో నిమగ్నమయ్యారు. అందుకే వర్కర్స్ పార్టీ వేడుకలకు హాజరు కాలేదు' అని చెప్పాడు.

ఆ ఫోటోల ఆధారంగా:
తాజాగా నిర్వహించిన వర్కర్స్ పార్టీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో ఈ వివరాలు తెలియవచ్చాయి. ఫోటోల్లో రి మాన్-గోన్, రాక్-గ్యోమ్ ఎక్కడా కనిపించకపోవడంతో.. చాలామందికి అనుమానం మొదలైంది. గతంలో నిర్వహించిన అన్ని ప్రభుత్వ వేడుకల్లోను వీరిద్దరు పాల్గొన్నారు. దాంతో ఈ వేడుకలకు మాత్రమే ఎందుకు దూరంగా? ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications