ఇంత క్రూరమా?: ట్రంప్ వలస విధానంపై సత్య నాదెళ్ల తీవ్ర స్పందన
వాషింగ్టన్: అమెరికా సరిహద్దులో అక్రమ వలసదారుల కుటుంబాల నుంచి పిల్లల్ని వేరు చేస్తున్న విధానంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఇదే అంశంపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా తీవ్రంగా స్పందించారు.

ఇంత క్రూరత్వమా?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్రమ వలసలపై అనుసరిస్తోన్న కఠిన వైఖరిని సత్య నాదెళ్ల వ్యతిరేకించారు. ఇది చాలా క్రూరమైన, అసంబద్ధమైన చర్య అన్నారు. అమెరికా అగ్రదేశంగా ఎదగడానికి వలస విధానమే కారణమని ఆయన తెలిపారు. వలసల వల్ల అమెరికా అగ్రదేశంగా ఏలా ఎదిగిందో, తనలాంటి వాళ్లు ఎలా ఈ స్థాయిలో ఉన్నారో ఉదహరించారు.

ఈ విధానాలు ఆందోళనకరం
‘ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం అనుసరిస్తోన్న కొత్తవిధానం చాలా క్రూరంగా ఉంది. దీనిలో మార్పును మైక్రోసాఫ్ట్ కోరుకుంటుంది. మనది వలస ప్రజల దేశం. దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు ఇతర దేశాల్లోని నిపుణులను ఆకర్షించగల సత్తా అమెరికాకు ఉంది. ఇప్పడు మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసలను అరికట్టడానికి అమెరికా అనుసరిస్తోన్న విధానాలు నన్ను ఆందోళనకు గురిచేస్తున్నాయి' అని సత్య నాదెళ్ల పేర్కొన్నారు.

చాలా దారుణం
అంతేగాక, ‘తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరు చేయడం చాలా దారుణం. నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం అమెరికా వలస విధానం ఘనతే. ఇక్కడ కాకుండా మరే దేశంలో నేను ఇంతటి పేరు పొందగలిగేవాడిని కాదు. ఈ వలసవిధానమే అమెరికాకున్న బలం. మానవహక్కులు, నైతికతను కాపాడేలా ఈ విధానాలు ఉండాలి. వాటికే మద్దతు తెలుపుతాను' అని తన బ్లాగులో సత్య నాదెళ్ల పేర్కొన్నారు.

మైక్రోసాఫ్ట్కు సంబంధం లేదు
‘అయితే ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తోన్న ఈ విధానంతో మైక్రోసాఫ్ట్కు ఏ సంబంధం లేదని చెప్పదలుచుకున్నాను ' అని సత్య నాదెళ్ల స్పష్టం చేశారు. కాగా, ట్రంప్ సర్కారు కఠిన విధానంతో వలసదారుల నుంచి వారి సంతానాన్ని వేరుచేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications