ట్రంప్ కు మోడీ ఇవ్వబోతున్న ఆఫర్లు ఇవే..! వరుస షాకుల ఎఫెక్ట్ ?
అమెరికాలో అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశాక భారత్ కు డొనాల్డ్ ట్రంప్ చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా తన ప్రమాణస్వీకారానికి భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించని ట్రంప్.. ఆ తర్వాత భారతీయ వలసల్ని గుర్తించి వెనక్కి పంపేస్తున్నారు. అంతే కాదు వారికి సంకెళ్లు చేసి భారత్ కు పంపుతున్న వీడియోలు సైతం గుట్టుగా లీక్ చేయించారు. అదీ మోడీ స్వరాష్ట్రం గుజరాత్ కు చెందిన వలసల్ని ఇలా పంపడంతో ఆయన తలెత్తుకోలేని పరిస్ధితి ఎదురైంది. దీంతో ఈ నెలలో వైట్ హౌస్ కు వచ్చి కలుస్తానని అపాయింట్ మెంట్ అడిగారు.
ఇప్పుడు అనుకున్నట్లుగానే అమెరికా ఈ నెల 12, 13 తేదీల్లో వెళ్లేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ సిద్దమవుతున్నారు. అక్కడ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో ఆయన ప్రధానంగా చర్చించే విషయాలపై భారీ అజెండానే ఉన్నప్పటికీ వలసల వ్యవహారమే కీలకంగా మారిపోయింది. అయితే ట్రంప్ తో భేటీలో వలసలతో పాటు మోడీ చర్చించే పలు అంశాల్లో అమెరికాకు ఇచ్చే ఆఫర్లు కూడా భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. వీటిపై తాజాగా మన బడ్జెట్ లో తీసుకున్న నిర్ణయాలను ట్రంప్ దృష్టికి మోడీ తీసుకెళ్లనున్నారు.

ట్రంప్ తాజా వ్యవహారశైలి చూశాక తాజా కేంద్ర బడ్జెట్ లోనే ప్రధాని మోడీ అమెరికాకు ఊరటనిచ్చే అంశాల్ని ప్రకటించారు. వీటిపై అప్పటికప్పుడు స్వదేశంలో జనం ఫోకస్ పడలేదు కానీ వాస్తవానికి ట్రంప్ కు మాత్రం అర్ధమైంది. దీంతో తమ వస్తువులపై భారీగా దిగుమతి పన్నులు విధిస్తున్న దేశాలపై ప్రతిగా తామూ అంతే పన్నులు విధిస్తామని చెప్పిన ట్రంప్ భారత్ విషయంలో వెనక్కి తగ్గారు. కెనడా, మెక్సికో వంటి ఇతర దేశాలపై పన్నులు పెంచినా భారత్ విషయంలో మాత్రం ట్రంప్ కనికరం చూపారు.
ఇంతకీ అలా ట్రంప్ ను ఆకట్టుకునేందుకు భారత ప్రధాని మోడీ.. కేంద్ర బడ్జెట్ లో ఇచ్చిన ఊరటలేంటో ఓసారి చూద్దాం.
హార్లే-డేవిడ్సన్ వంటి అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజాలకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో హై-ఎండ్ మోటార్సైకిళ్లతో సహా పలు కీలక అమెరికా దిగుమతులపై సుంకాలను తగ్గించడం ద్వారా ట్రంప్ యొక్క వాణిజ్య ప్రాధాన్యతలకు అనుగుణంగా మోడీ వ్యవహరించారు. అమెరికాతో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా లగ్జరీ కార్లు, సోలార్ సెల్స్తో సహా 30కి పైగా వస్తువులపై సుంకాలను కూడా భారత్ సమీక్షిస్తోంది.
మోటార్సైకిళ్లు, కార్లు, స్మార్ట్ఫోన్ విడిభాగాల వంటి వస్తువులపై కస్టమ్స్ సుంకాలను తగ్గిస్తున్నట్లు బడ్డెట్లో ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ఇందులో భాగమే. ఇది హార్లీ-డేవిడ్సన్, టెస్లా, ఆపిల్ వంటి అమెరికా దిగ్గజ కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ముఖ్యంగా పూర్తిగా దిగుమతి చేసుకున్న మోటార్సైకిళ్లపై సుంకాలు 50 శాతం నుంచి 40 శాతానికి తగ్గించేశారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలకు వాడే లిథియం-అయాన్ బ్యాటరీలపై కస్టమ్స్ సుంకాలను కూడా తీసేసారు. ఇది టెస్లా వంటి అమెరికన్ కంపెనీలను మన దేశంలో తమ కార్యకలాపాలను విస్తరించడానికి ఇచ్చే ప్రోత్సాహమే. అలాగే మొబైల్ ఫోన్ బ్యాటరీ ఉత్పత్తి పరికరాలపై సుంకాలు తగ్గించారు. దీంతో స్థానికంగా వీటి తయారీకి ప్రోత్సాహం లభిస్తుంది. అలాగే మన దేశంలో గణనీయమైన మార్కెట్ వాటా కలిగి ఉన్న యాపిల్ వంటి కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తుంది.












Click it and Unblock the Notifications