బెంగాల్ ఎన్నికల వేళ మోడీ బంగ్లా గుళ్ల సందర్శన- ఇక్కడ ఓట్ల కోసం అక్కడ హంగామా ?
మన ప్రధాని నరేంద్రమోడీకి దేవాలయాల సందర్శనలు కొత్త కాకపోయినా తాజాగా బంగ్లాదేశ్ పర్యటనలో ఆలయాల సందర్శన మాత్రం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. దీనికి కారణం పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలే. ఒకప్పుడు అవిభజిత బంగ్లాలో భాగంగా ఉన్న పశ్చిమబెంగాల్ రాష్ట్రం, బంగ్లాదేశ్ ప్రాంతం ఇప్పుడు ఎన్నికల వేళ మోడీకి కీలకంగా మారిపోయాయి. బెంగాల్ ఎన్నికల్లో గెలవాలంటే ముందుగా బంగ్లాదేశీయుల మనసుల్ని గెలవాలని నిర్ణయించుకున్న మోడీ.. ఢాకాలో ఓ షెడ్యూల్ కులానికి చెందిన ఆలయాన్ని దర్శించుకోవడం వెనుక ఆసక్తికర కారణాలు కనిపిస్తున్నాయి.
మోడీ బంగ్లా టూర్ వెనుక ?
ఓవైపు దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. బెంగాల్తో పాటు అస్సోంలోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ తొలిదశ పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అర్ధాంతరంగా బంగ్లాదేశ్ పర్యటన పెట్టుకున్న ప్రధాని మోడీ.. ఢాకా చేరుకుని అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో పాటు మోడీ పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. అంతే కాదు బంగ్లా విముక్తి పోరాటంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తాను కూడా ఆ పోరాటంలో భాగస్వామినయ్యానంటూ కొత్త విషయాన్ని ఇరుదేశాల ప్రజలకు చెప్పుకొచ్చారు. ఇదంతా బెంగాల్ ఎన్నికల కోసమేనా అన్న చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది.
బెంగాల్ ఎన్నికల కోసం బంగ్లాదేశ్ గుళ్లకు వెళ్లాలా ?
భారత్తో పోలిస్తే ముస్లిం దేశమైన బంగ్లాదేశ్లో గుళ్ల సంఖ్య చాలా తక్కువ. అక్కడ హిందువులు మైనార్టీలుగానే ఉన్నారు. ఒకవేళ గుళ్లను దర్శించుకోవాలంటే భారత్లోనే కొన్ని కోట్ల గుళ్లు ఉన్నాయి. అయినా బంగ్లాదేశ్ వెళ్లి మరీ ప్రధాని మోడీ గుళ్ల దర్శనం పెట్టుకోవడం వెనుక ఓ వివాదం, మరో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఓ ముస్లిం దేశానికి వెళ్లి హిందువుల గుళ్లను దర్శించుకోవడం ద్వారా మోడీ కొత్త వివాదానికి తెర దీశారని కొందరు భావిస్తుండగా.. మరికొందరు మాత్రం మోడీ చర్యను సమర్ధిస్తున్నారు. అలాగే బెంగాల్ ఎన్నికల కోసం బంగ్లాదేశ్ గుళ్లకు వెళ్లాలా అన్న చర్చ కూడా సాగుతోంది.
బంగ్లాదేశ్ హిందువుల ద్వారా బెంగాల్లో లబ్ది కోసం
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో లబ్ది కోసం బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రధాని మోడీ బెంగాల్లో విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉంది. కానీ దీన్ని వదిలిపెట్టి మరీ బంగ్లాదేశ్ స్వాతంత్ర అర్ధశతాబ్ది ఉత్సవాలతో పాటు బంగబంధు షేక్ ముజిబుర్ రెహ్మన్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మోడీ వెళ్లాలా అన్న చర్చ సాగుతోంది. అయితే మోడీ ఏ నిర్ణయం ఊరికే తీసుకోరు కదా. బెంగాల్ ఎన్నికల్లో గెలుపు కోసం బెంగాలీల మనసు దోచేందుకే ఈ గుళ్ల పర్యటన చేపట్టినట్లు తెలుస్తోంది. అన్నింటికంటే మించి బంగ్లా హిందువులను ఆకర్షించడం ద్వారా బెంగాల్లోని వారి బంధుమిత్రుల ఓట్లు కొల్లగొట్టే ఆలోచన మోడీ చేస్తున్నట్లు అర్ధమవుతోంది.