అర్ధరాత్రి ఇమ్రాన్ ఖాన్ ఆసుపత్రికి షిఫ్ట్- హాస్పిటల్ ఫ్లోర్లు సబ్ జైల్ గా డిక్లేర్డ్
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ వేకువ జామున ఆయనను జైలు నుంచి ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇస్లామాబాద్ లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి చేర్చారు. 73 ఏళ్ల వయసున్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించడానికి ఓ స్వతంత్ర వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు.
2023 ఆగస్ట్ నుంచి ఆయన రావల్పిండి లోని అడియాలా జైలులోనే శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పటివరకు ఆయనకు సంబంధించిన ఒక్క ఫొటో కూడా వెలుగులోకి రాలేదు. ఆరోగ్య పరిస్థితి గురించి కూడా బయటి ప్రపంచానికి తెలియదు. ఆ దేశ సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాతే.. ఇమ్రాన్ ఖాన్ ను తాజా ఆసుపత్రికి తరలించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయనను తరలించే సమయంలో కూడా ఫొటోలు, వీడియోలు రాకుండా భద్రత సిబ్బంది కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.

2022 ఏప్రిల్ వరకు ఆ దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు ఇమ్రాన్ ఖాన్. అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి పదవిని కోల్పోయారు. అనంతరం తోషాఖానా కేసులో దోషిగా తేలడంతో జైలు పాలు కావాల్సొచ్చింది. ఆ తర్వాత ఆయన సతీమణి బుష్రా బీబీపై కూడా పలు రకాల కేసులు నమోదయ్యాయి. ఈ ఆరోపణలు, కేసులన్నీ కూడా పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమేనని పీటీఐ వాదిస్తోంది. బెయిల్ కోసం చేసిన ఏ ప్రయత్నం కూడా సఫలం కాలేదు.
శిక్ష ప్రారంభమైనప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్ జైలు వెలుపలికి రావడం ఇదే మొదటిసారి. అడియాలా జైలు గోడల మధ్య దాదాపు 1,111 రోజుల పాటు అంటే మూడేళ్లకు పైగా సుదీర్ఘ ఖైదు అనుభవిస్తూ వస్తోన్నారాయన. ఆరోగ్యం క్షీణించడంతో వైద్య పరీక్షలు, చికిత్స కోసం ఇన్ని రోజుల తర్వాత మొదటిసారిగా బయటికొచ్చారు. హైబీపీ, గుండె సంబంధిత సమస్యలు, మానసిక ఆందోళన, కంటి చూపు సంబంధిత ఇన్ఫెక్షన్లతో ఇమ్రాన్ ఖాన్ బాధపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కుడి కంటి చూపు 15 శాతానికి మాత్రమే పడిపోయిందని ఆయన కుటుంబ సభ్యులు, పీటీఐ ప్రతినిధులు, న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. ఇమ్రాన్ ఖాన్ తరలింపు నేపథ్యంలో షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రిలోని కొన్ని విభాగాలను తాత్కాలికంగా సబ్ జైల్ గా డిక్లేర్ చేసిందక్కడి ప్రభుత్వం. హాస్పిటల్ లోని ఏ- 4, ఈ- 4 ఫ్లోర్ లను ఇస్లామాబాద్ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ప్రత్యేక వార్డుల్లో సాధారణ రోగుల రాకపోకలకు అనుమతి లేదు.
ఆసుపత్రి వద్ద దాదాపు 830 మందికి పైగా పోలీసు సిబ్బందిని నియమించారు. రౌండ్ ద క్లాక్ నిఘా ఉంచారు. ఈ సెక్యూరిటీ జోన్ పరిధిలో పనిచేసే డాక్టర్లు, ఇతర సిబ్బందికి మొబైల్ ఫోన్లను వాడే వీలు లేదు. ఇమ్రాన్ ఖాన్ కు సంబంధించిన ఏ సమాచారం గానీ, ఫొటోలు, వీడియోలు గానీ బయటికి రాకుండా చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే వార్డుల పరిసరాల్లో హై పవర్ సిగ్నల్ జామర్లను కూడా ఏర్పాటు చేశారు. ఆసుపత్రి వైపు వచ్చే ప్రధాన రహదారులను తాత్కాలికంగా మూసివేశారు.
#WATCH | Islamabad | Former Pakistani Prime Minister Imran Khan was transferred from Rawalpindi's Adiala Jail to Shifa International Hospital in Islamabad in the early hours today under tight security protocols
— ANI (@ANI) August 21, 2026
(Video source: Reuters) pic.twitter.com/MfhzlvDsZR















Click it and Unblock the Notifications