భూమివైపు వేగంగా దూసుకొస్తున్న గ్రహశకలం: నాసా హెచ్చరిక
లండన్: వెయ్యి మీటర్ల వెడల్పు కలిగిన ఓ గ్రహశకలం అతి వేగంగా భూమి వైపుకు దూసుకు వస్తోందని నాసా హెచ్చరించింది. ఇది ఈ నెల 27వ తేదీన శుక్రవారం నాడు భూగోళానికి సమీపంగా వెళ్తుంది. దీని పేరు 2014 వైబీ 35. ఇది భూమికి 2.8 మిలియన్ మైళ్ల దూరం సమీపానికి వచ్చే అవకాశం ఉందని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు.
ఇటీవలి కాలంలో భూమికి ఇంత సమీపంగా ఇంత వేగంతో ఏ గ్రహశకలం వచ్చినట్లుగా ఆధారాలు కనిపించడం లేదని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు. గత ఏడాదే ఈ గ్రహ శకలాన్ని గుర్తించారు. క్రమంగా దాన్ని గమనిస్తూ వచ్చారు. ఈ గ్రహశకలం ఇంత వేగంతో భూమిని ఢీకొంటే ఒక దేశమే తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంటుందంటుంటున్నారు.
2014 వైబీ 35 గ్రహ శకలం 23000 ఎంపీహెచ్ కంటే ఎక్కువ వేగంతో వస్తోందని చెప్పారు. ఈ తరహా పరిమాణం కలిగిన గ్రహశకలం భూమికి సమీపంగా రావడమన్నది ఐదువేల సంవత్సరాలకోసారి జరుగుతుందని చెప్పారు. అయితే ఇప్పటి వరకు తక్కువ పరిమాణం కలిగిన తోకచుక్కలు భూమికి సమీపంగా రావడం జరిగిందని ఇంత భారీ గ్రహశకలం దాదాపుగా భూమిని రాసుకుపోతోందా అన్నంత దగ్గరగా రావడం ఇదే మొదటిసారన్నారు.
ఒకవేళ ఈ గ్రహశకలం భూమిని ఢీకొంటే 15వేల మిలియన్ టన్నుల టీఎన్టీ విస్ఫోటక శక్తి ఉత్పన్నమవుతుందన్నారు. అలాగే పర్యావరణంలోనూ అత్యంత భయానకమైన రీతిలో మార్పులు చోటుచేసుకుంటాయని, భూకంపాలు, సునామీలు తలెత్తి అనేక జీవజాతులే తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంటుందన్నారు.

సైబీరియా ప్రాంతంలో 1908లో చోటుచేసుకున్న తుంగుస్కా తరహా పరిణామం కంటే భయానకమైన నష్టాన్నే ఇది కలిగించే అవకాశం ఉంటుందన్నారు. అప్పట్లో సంభవించిన ఆ విస్ఫోటక సంఘటన వల్ల 80 మిలియన్లకు పైగా మహావృక్షాలు భస్మీపటలమై పోయాయి. రష్యా అంతటా ఐదు పాయింట్ల తీవ్రతతో భూ ప్రకంపనలు చెలరేగాయి.












Click it and Unblock the Notifications