కాశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణ: బాన్ కీతో షరీఫ్
న్యూయార్క్: అందరూ అనుకున్నట్లుగానే పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ వద్ద జమ్మూకాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలపై ప్రసంగించే ముందు ఆదివారం ఆయన బాన్ కీ మూన్తో భేటీ అయ్యారు.
భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు సడలించేందుకు, నియంత్రణ రేఖ వద్ద ఉల్లంఘనలు ఆపేందుకు చొరవ తీసుకోవాలని ఆయన బాన్కీమూన్ను కోరినట్టు పాకిస్థాన్ దౌత్య వర్గాలు తెలిపాయి.
కాశ్మీర్ వివాదం విషయంలో భద్రతా మండలి తీర్మానాలను అమలుచేయాలని, కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలను తెలుసుకొనేందుకు రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని షరీఫ్ విజ్ఞప్తి చేశారు.

ఉద్రిక్తతలు తొలగించుకొనేందుకు భారత్, పాక్లు చర్చలు జరపాల్సిన అవసరముందని బాన్ కీ మూన్ అభిప్రాయపడ్డారు. మొత్తంగా వీరిద్దరి మధ్య సమావేశంలో కాశ్మీర్ అంశమే ప్రధానంగా చోటుచేసుకున్నట్టు తెలిసింది.
కాగా, ‘కాశ్మీర్ సమస్య ద్వైపాక్షిక అంశమని, ఈ విషయంలో ఐక్యరాజ్యసమితికి ఎటువంటి పాత్ర లేదన్నదే తమ వైఖరి' అని భారత్ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications