ఘోర విమాన ప్రమాదం: భారీగా ఎగిసిపడిన మంటలు, 72 మంది మృతి, ఐదుగురు భారతీయులు కూడా
ఖాట్మాండ్: నేపాల్ దేశంలోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఖాఠ్మాండ్ నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు బయల్దేరిన యతి ఎయిర్ లైన్స్కు చెందిన ఏటీఆర్ విమానం కుప్పకూలింది. విమానంలో ఉన్న 72 మంది కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఐదుగురు భారతీయులు ఉన్నారు.

నేపాల్ విమానంలో మొత్తం 72 మంది
ఈ ఘటన పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయం, పాత విమానాశ్రయం మధ్య చోటు చేసుకుంది. ప్రమాద ఘటనను యతి ఎయిర్ లైన్స్ సిబ్బంది సుదర్శన్ బర్తౌలా ధృవీకరించారు. ఆ సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులతోపాటు నలుగురు విమాన సిబ్బంది ఉన్నారు. భారీగా మంటలు చెలరేగడంతో దాదాపు విమానంలోని వారంతా మరణించినట్లు తెలుస్తోంది.
నేపాల్ విమాన ప్రమాదం: 30 మంది మృతదేహాల వెలికితీత
అయితే, ఇప్పటి వరకు ఘటనా స్థలంలో 30 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ తెక్ బహదూర్ కేసీ స్థానిక మీడియాకు వెల్లడించారు. ఈ విమానంలో ఉన్నవారు ప్రాణాలతో బయటపడటం అసాధ్యమేనని చెప్పారు. మృతదేహాలను వెలికితీస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో విమానానికి చెందిన ఒక్క రెక్క తప్ప మొత్తం విమానం కాలిపోవడం గమనార్హం.
విమానం వద్ద ఎగిసిపడుతున్న మంటలు
ఘటనా స్థలంలో మంటలు గిసిపడుతుండటంతో మృతదేహాలు వెలికితీత ఆలస్యమవుతోంది. మృతదేహాలను గుర్తించడం కూడా సాధ్యం కాకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ విమానంలో పది మంది విదేశీయులు ఉన్నట్లు చెప్పారు. విమాన ప్రమాదంపై నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యవసర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి.. భద్రతా దళాలు, హోంశాఖ వెంటనే సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే, ఈ విమాన ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications