నేపాల్: ఎన్నోసార్లు తట్టుకొని, ఇప్పుడు నేలమట్టమైన 500 ఏళ్లనాటి ఆలయం
ఖాట్మాండ్: నేపాల్లో సంభవించిన భారీ భూకంపం వల్ల రాజధాని ఖాట్మాండులోని 500 ఏళ్ల క్రితం నాటి చారిత్రక కష్టమండప్ దేవాలయం కూలిపోయింది. దీని శిథిలాల కింద అనేకమంది సజీవసమాధి అయ్యారు. కాకతాళీయంగా భూకంపం సంభవించిన రోజునే ఒక ప్రైవేటు కంపెనీ ఈ ఆలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది.
దీంతో, రక్తదానం చేయడానికి వచ్చిన వారితో పాటు రక్తాన్ని సేకరించడానికి వచ్చిన నర్సులు కూడా మృతి చెందారు. ఒక్క క్షణంలోనే ఘోరం జరిగిందని, ఆలయంలో ఉన్న వారికి బయటపడటానికి సమయం కూడా లేకపోయిందని, కొద్దిమంది మాత్రం తమ చేతులకు ఉన్న సిరంజీలను తీసివేసి బయటకు పరుగెత్తుకు వచ్చారని భూకంపం వచ్చిన రోజు ఆలయానికి సమీపంలో వాలంటీర్గా పని చేసిన అజయ్ శాక్యా (21) చెప్పారు.
గతంలో వచ్చిన భూకంపాలన్నింటినీ ఈ దేవాలయం తట్టుకుంది. అందువల్ల ఈసారి కూడా తట్టుకుంటుందని భావించిన కొంతమంది ప్రజలు బయట ఉన్నవారు దేవాలయంలోకి పరుగెత్తుకు వెళ్లారని ఆయన వివరించారు. అయితే అదృష్టవశాత్తు భూకంపం సంభవించిన సమయంలో రక్తదాన శిబిరం ముగింపు దశకు వచ్చిందని, దానివల్ల మృతుల సంఖ్య తగ్గిందని మరో వాలంటీర్ సునితి టమ్రకర్ చెప్పారు.
ఈ దేవాలయం శిథిలాల కింద నర్సుల మృతదేహాలను కనుగొన్నారు. తమ తలలకు రక్షణగా తమ చేతులను ఉంచుకున్న భంగిమలో ఆ మృతదేహాలు ఉన్నాయని టమ్రకర్ తెలిపారు. 16వ శతాబ్దం నాటి ఈ దేవాలయం ప్రఖ్యాతి పొందిన దర్బారా కూడలికి సమీపంలో ఉంది. రాజధానిలోని నేపాలీల వారసత్వ సంపదగా ఈ ఆలయం ఉంది.