Nepal flash floods: భీకర వరదలకు ఎదురొడ్డి నిలిచిన ఒక్కే ఒక్క ఇల్లు..!
నేపాల్ లో సంభవించిన ఆకస్మిక వరదల ధాటికి ఆ దేశం అతలాకుతలం అవుతోంది. ప్రకృతి విలయతాండవానికి మరోసారి నేపాల్ బలైంది. 2013 లో నేపాల్ లో భూకంపం తర్వాత మరోసారి ఆ దేశంపై ప్రకృతి పగబట్టింది. ఆకస్మిక వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. నేపాల్- టిబెట్ సరిహద్దులోని హిమాలయ ప్రాంతంలో ఆగస్టు 26న సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా నేపాల్ లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఇప్పటి వరకూ మరణించినవారి సంఖ్య 547 కు పెరిగింది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వరదల్లో ఇప్పటివరకూ సుమారు 1600 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 288 మంది భారతీయులు ఉన్నారని సమాచారం అందుతోంది. అలాగే వరదల్లో చిక్కుకుపోయిన వారిలో తెలంగాణకు చెందిన 23 మంది ఎన్ ఆర్ ఐలు ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే నేపాల్ వరదల్లో పెద్ద పెద్ద భవనాలు, నిర్మాణాలు పేక మేడల్లా కూలిపోయాయి. అయితే ఇంతటి విధ్వంసం మధ్య ఒకే ఒక ఇల్లు మాత్రం ఈ భారీ వరదలను తట్టుకుని నిలబడింది. ఉవ్వెత్తున ఎగిసే వరద నీటిని సైతం ఈ ఇల్లు తట్టుకుని నిలబడింది. ఆ ఇంటి కుటుంబాన్ని రక్షించింది. ఆ ఇంట్లోనే కుటుంబ సభ్యులు సాయం కోసం బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. చుట్టూ కనుచూపు మేర ఎటు చూసినా వరద బీభత్సమే ఉంది. అంతటి వరదలో ఒంటరిగా ఆ ఇల్లు అలా నిలబడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వరద ధాటికి చుట్టుపక్కల ఇళ్లు మొత్తం కొట్టుకుపోగా ఆ ఒక్క ఇల్లు మాత్రమే ఏమాత్రం డ్యామేజ్ కాకుండా అలా నిలబడటంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే వరదల ఉద్ధృతికి తమ ఇల్లు కూడా ఎక్కడ కూలిపోతుందోనని ఆ ఇంట్లోని వాళ్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
That family in the green house. I hope they are alive and safe. 🙏🏻 what a nightmare. pic.twitter.com/t2tVR2cFD7
— Pooja Shali (@PoojaShali) August 28, 2026
నేపాల్ ప్రభుత్వం హెలికాప్టర్ ద్వారా వరదల్లో చిక్కుకున్న వారిని సంరక్షిస్తున్న నేపథ్యంలో సహాయక బృందాల కోసం వారు ఎంతగానో ఎదురుచూశారు. అయితే ఈలోపు వరద బీభత్సం తగ్గడంతో వారు సురక్షితంగా ఆ ఇంటి నుంచి బయటపడ్డారు. ఇక ఇందుకు సంబంధించిన దృశ్యాలను నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా షేర్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications