నో టాక్స్: మోడీ, షరీప్ కరచాలనం చేసుకున్నారు
ఖాట్మండు: నేపాల్ రాజధాని ఖాట్మండ్లో జరుగుతున్న సార్క్ శిఖరాగ్ర సదస్సులో బుధవారంనాడు ఎడమొహం పెడమొహంగా ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీప్ గురువారం కరచాలనం చేసుకున్నారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత వారిద్దరు కలుసుకోవడం ఇదే తొలిసారి. ఈ సమయంలో వారిద్దరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ పిటిఐ వార్తా సంస్థతో చెప్పారు
ఖాట్మండుకు 20 కిలోమీటర్ల దూరంలో కావ్రే జిల్లాలో గల ధులిఖేల్లో ఏర్పాటు చేసిన అనధికార సమావేశంలో వారిద్దరు కలుసుకున్నారు. అనధికార ద్వైపాక్షిక, బహుపాక్షిక చర్చలకు ఈ సమావేశం ఏర్పటైంది. మోడీ, షరీఫ్ మధ్య అధికారికంగా ద్వైపాక్షిక చర్చలు జరగలేదని చెప్పారు.
బుధవారం జరిగిన సార్క్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభ కార్యక్రమంలో పాకిస్తాన్ ప్రధాని నవాబ్ షరీఫ్, భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్య మాటలు లేవు. మూడు గంటలకు పైగా జరిగిన కార్యక్రమంలో వారి మధ్య రెండు సీట్ల దూరమే ఉన్నప్పటికీ ఒకరి వైపు ఒకరు చూసుకోలేదు. ఒకరినొకరు పట్టించుకోలేదు.
నవాజ్ షరీఫ్ ప్రసంగం ముగించుకుని తన సీటు దగ్గరకు మోడీని దాటుకుని వెళ్లినప్పుడు కూడా ఇద్దరి నేతల చూపులు కలవలేదు. షరీఫ్ తన ప్రసంగం చేయడానికి కదిలిపోతుండగా అటువైపు కూడా చూడకుండా మోడీ బుక్లెట్ చూస్తూ కనిపించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన తర్వాత దేశాధినేతలను హోల్డింగ్ రూంలో సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అయితే మోడీ, కొయిరాల చాలా సేపు వేదిక మీదనే ఇరువురు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఆ తర్వాత వీరివురు హోల్డింగ్ రూంలోకి వెళ్లారు. అక్కడ కూడా మోడీ, షరీఫ్ కలుసుకునే అవకాశం కలగలేదు.