కరోనా వ్యాక్సిన్పై బెట్టింగులొద్దు:ఇది జగమొండి:డ్రగ్స్ను కనుగొంటామనే గ్యారంటీ లేదు:డబ్ల్యూహెచ్ఓ
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా లక్షా 60 వేలమందిపై ప్రజలను పొట్టనబెట్టుకున్న మహమ్మారి కరోనా వైరస్. చైనాలో తొలిసారిగా బయటపడిన ఈ వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంది. కొమ్ములు తిరిగిన దేశాలు, దేశాధినేతలను గడగడలాడిస్తోంది. భయాందోళనల్లోకి నెట్టేసింది. రోజురోజుకూ, ఆ మాట కొస్తే.. గంటగంటకూ వందలాది మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. లక్షలాది మంది శరీరంలో తిష్ట వేసుక్కూర్చుంది. కనిపించకుండా కొరికి తినేస్తోంది.
నాలుగు నెలలైన వ్యాక్సిన్లు లేవు..
కరోనా వైరస్కు ఇప్పుడు కాకపోయినా, సమీప భవిష్యత్తులోనైనా మందులను కనుగొంటారని ఆశతో ఎదురు చూస్తున్నారు కోట్లాదిమంది ప్రజలు. వ్యాక్సిన్ను కనుగొనడానికి.. ఈ వైరస్ పుట్టుకకు కారణమైన చైనా సహా అన్ని అభివృద్ధి చెందిన దేశాలు తమవంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఈ నాలుగు నెలల వ్యవధిలో కరోనా వైరస్ విజృంభణకు చెక్ పెట్టేలా ఎలాంటి డ్రగ్స్ గానీ, వ్యాక్సిన్లు గానీ కనుగొనలేకపోతున్నారు పరిశోధకులు.
బాంబు పేల్చిన రాయబారి..
తాజాగా- ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రత్యేక రాయబారి ఒకరు దీనిపై బాంబు పేల్చారు. కరోనా వైరస్ను అరికట్టడానికి అవసరమైన వ్యాక్సిన్ను కనుగొంటామనడానికి ఎలాంటి గ్యారంటీ లేదని డబ్ల్యూహెచ్ఓ ప్రత్యేక రాయబారి డేవిడ్ నబర్రో అభిప్రాయపడ్డారు. బ్రిటన్కు చెందిన డేవిడ్.. లండన్లోని ఇంపీరియల్ కాలేజీలో గ్లోబల్ హెల్త్ విభాగం ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు ప్రత్యేక రాయబారిగా వ్యవహరిస్తున్నారు.
బెట్టింగులొద్దు..
ది అబ్జర్వర్ ప్రతికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డేవిడ్ పలు విషయాలను వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందాడాన్ని నివారించడానికి ఇప్పటివరకు సోషల్ డిస్టెన్సింగ్ ఒక్కటే మార్గమని అన్నారు. ఈ వైరస్ను నిర్మూలించడానికి అవసరమైన వ్యాక్సిన్ను ఇప్పట్లో తయారు చేస్తారనే గ్యారంటీ లేదని చెప్పారు. మానవత్వం, ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి సోషల్ డిస్టెన్సింగ్ను పాటించడం మాత్రమే ప్రస్తుతానికి చేయగలమని అన్నారు.
Recommended Video
కొన్ని వైరస్లు జగమొండి:
కొన్ని వైరస్ల సహజసిద్ధంగా ఎలాంటి మందులకు గానీ, డ్రగ్స్కు గానీ లొంగబోవని డేవిడ్ అభిప్రాయపడ్డారు. కరోనా అలాంటి జగమొండి జాతికి చెందిన వైరస్గా భావిస్తున్నానని చెప్పారు. దీని ప్రభావం వయోధిక వృద్ధులపై తీవ్రంగా ఉంటుందని అన్నారు. ఈ వైరస్ మానవ శరీరంలోని అవయవాలను నిర్వీర్యం చేస్తుందని, ఫలితంగా పేషెంట్లు మరణిస్తున్నారని చెప్పారు. యువతతో పోల్చి చూస్తే.. వయోధిక వృద్ధుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని చెప్పారు. రోగ నిరోధక శక్తిని పెంచడానికి పేషెంట్లకు పౌష్టికాహారాన్ని అందించాల్సి ఉంటుందని అన్నారు.