లాక్డౌన్:వ్యాక్సిన్ వచ్చేదాకా అన్నీ బంద్.. రొడ్రిగో సంచలనం.. మన బడులపై అమిత్ శాఖ క్లారిటీ..
కరోనా మహమ్మారి ఎంతకూ కంట్రోల్ లోకి రాకపోవడంతో ప్రపంచ దేశాలన్నీ ఒక్కొక్కటిగా లాక్ డౌన్ ఎత్తేస్తూ వస్తున్నాయి. బుధవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా వైరస్ కాటుకు గురైనవాళ్ల సంఖ్య 57లక్షలు దాటింది. అందులో 3.5లక్షల మంది ప్రాణాలు కోల్పోగా, మరో 24.5లక్షల మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. మన దేశంలో గడిచిన 24 గంటల్లో 6,387 కొత్త కేసులు, 170 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1.50లక్షలకు, మరణాలు 4,337కు పెరిగాయి. ఈ కీలక దశలో లాక్ డౌన్ పొడగించాలా? వద్దా? అనేదానిపై కేంద్ర-రాష్ట్రాల మధ్య ఘర్షణ నడుస్తున్నది. ఈలోపే విద్యా సంస్థల రీఓపెనింగ్ పై పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి..

కేంద్ర హోం శాఖ క్లారిటీ..
లాక్ డౌన్ కారణంగా మార్చి 25 నుంచి దేశమంతటా విద్యా సంస్థలు మూతపడిఉన్న సంగతి తెలిసిందే. చాలా వరకు స్కూళ్లు ఆన్ లైన్ లో బోధన కొనసాగిస్తున్నాయి. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలను రీఓపెన్ కాబోతున్నాయంటూ మంగళవారం భారీ ప్రచారం జరిగింది. అన్ని ప్రముఖ టీవీలు, పేపర్లలో దీనిపై వార్తలు వచ్చాయి. ప్రచారం ఉధృతంగా సాగడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. విద్యా సంస్థల రీఓపెనింగ్ కు అనుమతులిచ్చినట్లు వచ్చిన వార్తలు నిజం కావని, తదుపరి ఆదేశాలు వచ్చేదాకా అన్ని విద్యా సంస్థలు మూసే ఉంటాయని హోం శాఖ స్పష్టం చేసింది.

జూన్ 15 వరకు పొడగింపు..
స్కూళ్లకు సంబంధించి కేంద్ర హోం శాఖ క్లారిటీ ఇచ్చిన కొద్ది గంటలకే దేశవ్యాప్త లాక్ డౌన్ పైనా తాజా అప్ డేట్స్ వెలుగులోకి వచ్చాయి. లాక్ డౌన్ కు సంబంధించిన నిర్ణయాధికారాలన్నీ రాష్ట్రాలకే ఉండాలంటూ ప్రధాని మోదీతో కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రులు డిమాండ్ చేసిన నేపథ్యంలో.. లాక్ డౌన్ 5.0 నిర్ణయాన్ని కేంద్రం.. రాష్ట్రాలకే వదిలేసినట్లు తెలుస్తోంది. తన వంతుగా రెండు వారాల పాటు(జూన్ 15 వరకు) పొడగింపును ప్రకటించనున్న కేంద్రం.. దాన్ని అమలు చేయాలా? వద్దా? అనే నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలిపెట్టబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలాఉంటే, స్కూళ్ల రీఓపెనింగ్ పై ఫిలిప్పీన్స్ దేశాధినేత తీసుకున్న అనూహ్య నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది.

వ్యాక్సిన్ వచ్చేదాకా బంద్..
నియంతృత్వంలోగానీ, అగ్రరాజ్యం అమెరికాను ఢీకొట్టడంలోగానీ ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్కు ఏమాత్రం తీసిపోరు ఫిపిప్పీన్స్ ప్రెసిడెంట్ రొడ్రిగో డ్యుటెర్టె. డ్రగ్స్ మాఫియాను ఊచకోత కోయడం, పెళ్లైన మహిళలతో రొమాన్స్ చేయడం, దేవుడే ఉంటే సెల్ఫీ దిగి పంపాలని సవాలు చేయడం.. ఒక్కటేంటి.. ఆయన ప్రతి చర్యా ఒక సంచలనమే. అలవాటైన పద్ధతిలోనే ఇప్పుడు లాక్ డౌన్ పైనా అనూహ్య నిర్ణయం తీసుకున్నారాయన. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేదాకా ఆంక్షలు కొనసాగుతాయని, దేశంలో బడులన్నీ బంద్ పెట్టేస్తానని ప్రకటించారు.

బతికుంటే బలుసాకు టైప్లో..
‘‘నా పిల్లల విషయంలో రిస్క్ తీసుకోదల్చుకోలేదు. చదువుల సంగతి పక్కనపెడితే, ఇప్పటికిప్పుడు బడులు తెరిస్తే, విపత్తును కొనితెచ్చుకున్నట్లే. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేదాకా బడీ,గుడీ దేన్నీ తెరిచేదే లేదు. పౌరుల ప్రాణాలకు ప్రమాదంలేదని రూఢీ చేసుకున్న తర్వాతే లాక్ డౌన్ సడలింపులు కల్పిస్తా''అని రొడ్రిగో కుండబద్దలుకొట్టారు. ఫిలిప్పీన్స్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,319కాగా, అందులో 873 మంది కన్నుమూశారు.












Click it and Unblock the Notifications