మా దేశానికి ఐఎస్ఐఎస్ ముప్పు లేదు: ఒబామా
వాషింగ్టన్: ఎటువంటి ఉగ్రవాద సంస్థలు ప్రస్తుతానికి అమెరికా దేశంపై దాడులు చేసే అవకాశం లేదని ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. యూఎస్ నిఘా వర్గాలు, ఇతర వర్గాల సమాచారం మేరకు ఎలాంటి ఉగ్రదాడులు జరిగే సూచనలు కనిపించడం లేదని స్పష్టం చేశారు.
వర్జీనియాలోని నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ లో యూఎస్ సెక్యూరిటీ అధికారులతో సమావేశం అయ్యారు. అనంతరం బరాక్ ఒబామా ఉగ్రముప్పు తదిత అంశాలపై మాట్లాడారు. ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం లేనప్పటికీ దేశం మొత్తం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
దేశంలోని అన్ని నగరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చెయ్యాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని వివరించారు. ఉగ్రవాదులకు అమెరికా టార్గెట్ అయితే ఇక వారికి కష్టాలు మొదలైనట్లేనని, ఇక దేవుడు కూడా వారిని కాపాడలేడని అన్నారు.
సిరియా, ఇరాక్ లో ఉన్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులపై దాడులు చెయ్యాలని అధికారులకు సూచించారు. ఈ విషయంపై ఆదేశాల నేతలతో కూడా చర్చించినట్లు వివరించారు. కాలిఫోర్నియా కాల్పుల ఘటనను దృష్టిలో పెట్టుకోవాలని అధికారులకు సూచించారు.
విదేశాల నుంచి అమెరికాకు వచ్చే శరణార్థులలో ఉగ్రవాదులు ఉండే అవకాశం ఉందని, అందువలన బయో మెట్రిక్ విధానం ప్రవేశపెట్టి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు అడ్డుకట్ట వేస్తామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వివరించారు.