అమెరికా హెచ్చరికలు బేఖాతరు: వరుస క్షిపణులతో హడలెత్తిస్తున్న ఉ.కొరియా
అగ్రదేశం అమెరికా ఎన్ని హెచ్చరికలు చేసినా ఉత్తరకొరియా పట్టించుకోవడం లేదు. తనకేం పట్టనట్లు తనపని తాను చేసుకుపోతోంది.
సియోల్: అగ్రదేశం అమెరికా ఎన్ని హెచ్చరికలు చేసినా ఉత్తరకొరియా పట్టించుకోవడం లేదు. తనకేం పట్టనట్లు తనపని తాను చేసుకుపోతోంది. అమెరికాతో కయ్యానికి కాలు దువ్వుతూ తాజాగా సోమవారం ఉత్తర కొరియా మరో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది.
కాగా, జపాన్ సముద్రంలోకి ఈ క్షిపణిని ప్రయోగించడం గమనార్హం. దాదాపు ఆరు నిమిషాల పాటు ఈ క్షిపణి పయనించిందని యూఎస్ పసిఫిక్ కమాండ్ తెలిపింది. కాగా, వారంలో ఇది మూడో క్షిపణి కావడం గమనార్హం.
అమెరికాతో యుద్ధం చేసేందుకు ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్నామని చెబుతున్న ఉత్తర కొరియా తాజా ప్రయోగం చేయడంతో అమెరికాతోపాటు పొరుగు దేశాలైన దక్షిణ కొరియా, జపాన్లకు ఆగ్రహం తెప్పించ్చింది.
ఉత్తర కొరియా తీరును జపాన్ తీవ్రంగా ఖండించింది. ఉత్తర కొరియాను నిలువరించేందుకు అమెరికాతో కలిసి పనిచేస్తామని జపాన్ ప్రధాని షింజో అబే ప్రకటించారు. అంతర్జాతీయ సంఘాలు ఎన్నిసార్లు హెచ్చరించినా.. ఉత్తర కొరియా మాత్రం రెచ్చగొట్టే చర్యలు ఆపడం లేదని, ఇక సహించేది లేదని షింజో అబే అన్నారు. మరోవైపు ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగంపై అటు దక్షిణ కొరియా కూడా ఆందోళన వ్యక్తం చేసింది.