మాటలతో కాదు.. మంటలతో జవాబిస్తాం: అమెరికాపై ఉత్తరకొరియా ఫైర్
అగ్రరాజ్యం అమెరికా, ఉత్తరకొరియా మధ్య మాటల యుద్ధం శృతిమించుతోంది. అసలే పరిస్థితి ‘పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే’లా ఉండగా, ఇరు దేశాల నాయకులు పరస్పరం వార్నింగ్ లతో పరిస్థితిని మరింత తీవ్రం చేస్తున్నారు.
మాస్కో: అగ్రరాజ్యం అమెరికా, ఉత్తరకొరియా మధ్య మాటల యుద్ధం శృతిమించుతోంది. అసలే రెండు దేశాల నడుమ పరిస్థితి 'పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే'లా ఉండగా, మరోవైపు ఇరు దేశాల నాయకులు పరస్పరం వార్నింగ్ లతో పరిస్థితిని మరింత తీవ్రం చేస్తున్నారు.
వరుస క్షిపణి ప్రయోగాలతో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న ఉత్తరకొరియాపై అమెరికా ఎడాపెడా వాగ్బాణాలు సంధిస్తూనే ఉంది. అయినా ఆ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉత్తరకొరియా సై అంటే సై అంటూ మాటల దాడికి దిగుతోంది.

ఆంక్షలతో అణిచివేయగలరా?
గత కొద్ది రోజులుగా అమెరికా, ఉత్తరకొరియా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. వరుస క్షిపణి ప్రయోగాలతో పొరుగు దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఉత్తరకొరియా ఆగడాలను అరికట్టేందుకు అమెరికా ప్రయత్నాలు చేపట్టింది. ఇప్పటికే ఆ దేశంపై కఠిన ఆంక్షలు విధించేలా ఐరాసలో అమెరికా పెట్టిన తీర్మానానికి ఆమోదం లభించిన విషయం తెలిసిందే.

అమెరికా అధ్యక్షుడే మొదలుపెట్టారు...
అమెరికా, ఉత్తరకొరియా దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే కచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా ఉందని ఒకవైపు విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మరోవైపు ఉత్తరకొరియా మాటలనే ఆగ్నేయాస్త్రాలుగా మలిచి వదులుతోంది. యుద్ధానికి నిప్పు పెట్టింది ట్రంపేనని.. ఆ తరువాత ఏం జరిగినా ఆయనదే బాధ్యత అని తేల్చేస్తోంది.

ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రేలాపన...
రష్యాలో పర్యటిస్తోన్న ఉత్తరకొరియా విదేశాంగ మంత్రి రి యాంగ్ హో అక్కడి అధికారిక మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికాపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశం చేస్తోన్న అణుప్రయోగాలు దేశ ప్రజల శాంతి భద్రతల కోసమేనన్నారు. అమెరికా అధ్యక్షుడే ఐక్యరాజ్యసమితి వేదికగా పిచ్చిపట్టినట్లుగా ఉత్తరకొరియాపై వ్యాఖ్యలు చేశారంటూ దుయ్యబట్టారు.

మాటలు కాదు.. మంటలతో జవాబిస్తాం...
తమపై యుద్ధానికి అమెరికా అధ్యక్షుడే నిప్పు పెట్టారని, ట్రంప్ కు మాటలతో కాకుండా మంటలతో జవాబిస్తామని ఉత్తరకొరియా విదేశాంగ మంత్రి రి యాంగ్ హో పేర్కొన్నారు. . అమెరికా శక్తిసామర్థ్యాలతో సరితూగేందుకు తమ దేశం కూడా సిద్ధమవుతోందన్నారు. అంతేకాదు, తమ లక్ష్యాలను చేరుకోవడంలో తాము చివరి దశలో ఉన్నామంటూ హెచ్చరించారు.

దానిపై మేం మాట్లాడే సమస్యే లేదు...
తాము మొదటి నుంచీ ఒకే మాట చెబుతున్నామని, తమ దేశం చేస్తున్న అణ్వస్త్ర ప్రయోగాలు తమ దేశ భద్రత కోసమేనని రి యాంగ్ హో ఉద్ఘాటించారు. తమ వద్ద ఉన్న అణ్వాయుధాల గురించి చర్చలు వస్తే వాటిపై మాట్లాడేందుకు తామెప్పటికీ అంగీకరించమని అని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications