ఉత్తర కొరియా ఉక్కిరిబిక్కిరి - కరోనా డేంజర్ బెల్స్ : 27కు చేరిన మరణాలు..!!
ఉత్తర కొరియాను జ్వరం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. దేశంలో శుక్రవారం ఒక్క రోజే 21 మంది జ్వరంతో మరణించారు. మొత్తం మరణాలు 27కు చేరాయి. మరోవైపు.. మొత్తం జ్వరపీడితులు 5 లక్షలు దాటారు. ఈ క్రమంలో కరోనాను దేశ చరిత్రలోనే అతిపెద్ద సవాల్గా పేర్కొన్నారు కిమ్ జోంగ్ ఉన్. శుక్రవారం ఒక్కరోజే 1,74,440 మంది జ్వరపీడితులుగా మారారు. ఏప్రిల్ చివరి వారం నుంచి దేశవ్యాప్తంగా మొత్తం 5,24,440 మంది అనారోగ్యం పాలయ్యారు.
ఇప్పటివరకు 2,43,630 మంది కోలుకున్నారని, 2,80,810 మందిని క్వారంటైన్కు తరలించినట్లు ఉత్తర కొరియా తెలిపింది. అయితే.. మృతుల్లో కరోనా కారణంగా ఎంత మంది చనిపోయారనే విషయంపై స్పష్టత లేదు. కొవిడ్ మహమ్మారి వ్యాప్తిని దేశ చరిత్రలోనే అతిపెద్ద సవాలుగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అభివర్ణించారు. ప్రజలు, ప్రభుత్వం ఏకమై కరోనా వైరస్ను వీలైనంత త్వరగా కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏప్రిల్ చివరి వారం నుంచి దేశంలో జ్వర పీడితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఫీవర్తో గురువారం ఆరుగురు మరణించగా, వారిలో ఒకరికి కరోనా ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయింది. తాజాగా మరో 21 మంది జర్వానికి బలయ్యారు.
కాగా, వీరి మరణానికి కారణం కరోనానా లేదా మరోటా అనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా ధృవీకరించలేదు. అయితే దేశంలో మొదటిసారిగా మే 12న తొలి కరోనా కేసు నమోదైంది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా మూడు దశల్లో విళయతాండం చేసినప్పటికీ కిమ్ ఏలుబడిలో ఉన్న కొరియాలో మాత్రం ఒక్క కేసూ నమోదవలేదు. అయితే తాజా పాజివ్ కేసులు వెలుగు చూస్తుండటంతో దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించడంతోపాటు లాక్డౌన్ ప్రకటించారు. కరోనాను అడ్డుకోవడానికి వ్యాక్సిన్లను అందిస్తామని డబ్ల్యూహెచ్వో, రష్యా, చైనా ప్రకటించాయి. అయితే కిమ్ దానికి ఒప్పుకోలేదు. ఉత్తర కొరియా ప్రజలు ధైర్యంగా కరోనాను ఎదుర్కొంటారని చెప్పారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులకు కిమ్ అనాలోచిత చర్యలే కారణమనే విశ్లేషణలు మొదలయ్యాయి.