ఉత్తరకొరియా: యూఎస్ విద్యార్థికి 15ఏళ్ల బానిసత్వ శిక్ష
సియోల్: ఒట్టో ఫ్రెడరిక్ వాంబియర్ అనే అమెరికన్ విద్యార్థికి ఉత్తర కొరియా సుప్రీంకోర్టు కఠిన శిక్షను విధించింది. పదిహేనేళ్లపాటు తమ దేశంలో ఊడిగం (కఠిన శ్రామికుడు)గా చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర కొరియా అధికారులు ధృవీకరించారు.
కాగా, ఈ విషయాన్ని చైనాకు చెందిన మీడియా సంస్థ నిర్ధారించింది. వాంబియర్ వర్జీనియా విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. జనవరిలో ఉత్తర కొరియా పర్యటనకు వెళ్లాడు.
ప్యాంగ్ యాంగ్లోని ఓ హోటల్లో దిగి తిరిగొచ్చే సమయంలో అతడు కొన్ని నినాదాలతో లిఖించిన వస్తువును దొంగిలించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టగా ఇది తమ దేశానికి వ్యతిరేకంగా చేసిన నేరం అని పేర్కొంటూ 21ఏళ్ల ఒట్టోకు 15 ఏళ్ల కఠిన బానిసత్వ శిక్షను వేసింది. కాగా, అమెరికాలోని ఒహియో ప్రాంతానికి చెందిన ఒట్టో.. తాను చేసింది తప్పేనని, తనను క్షమించి వదిలేయాలని ప్రాధేయపడ్డాడు. అయినా ఫలితం లేకపోయింది.
కాగా, ఈ విషయంపై అమెరికాకు చెందిన ఓ ఉన్నతాధికారి ఉత్తరకొరియాకు చెందిన ఇద్దరు అధికారులతో మాట్లాడారు. వాంబియర్ను విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.