ఏం జరగబోతుంది?: యుద్దానికి సిద్దపడేలా అమెరికా-ఉత్తరకొరియా 'మాటల యుద్దం'
యుద్దానికి యుద్దంతోనే బదులిచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఉత్తరకొరియా ద్వితీయ శ్రేణి అధికారి ప్రతినిధి చో రియాంగ్ హే ప్రకటించారు.
ప్యాంగ్యాంగ్: ఓవైపు సిరియా అంతర్యుద్దం.. మరోవైపు అమెరికా క్షిపణి ప్రయోగాలు, మధ్యలో ఉత్తరకొరియా దుందుడుకు చర్యలు.. ఇవన్నీ చూస్తుంటే మూడో ప్రపంచ యుద్దాన్ని తలపించే వాతావరణం కనిపిస్తోంది. రష్యా చేసిన హెచ్చరికలను బేఖాతరు చేస్తూ సిరియాపై క్షిపణి దాడులు చేసిన అమెరికా.. ఇప్పుడు ఉత్తరకొరియాకు ఇదే హెచ్చరిక చేస్తోంది.
ఉత్తరకొరియాపై దాడికి సిద్ధమైన అమెరికా? సైన్యాన్ని అప్రమత్తం చేసిన కిమ్ జాంగ్ ఉన్!
హైడ్రోజన్ బాంబుతో ప్రపంచానికే వణుకు పుట్టించిన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్.. తాజాగా మరో అణ్వస్త్ర పరీక్షకు సిద్దమవుతున్నాడంటూ వార్తలు రావడంతో.. ఇటు అమెరికా కూడా అప్రమత్తమైంది. అదే గనుక జరిగితే ఉత్తరకొరియాపై క్షిపణి దాడులు తప్పవని హెచ్చరించింది.
సైనిక సహనం కోల్పోయాం:
ఈ వ్యాఖ్యలకు అటు ఉత్తరకొరియా సైతం ధీటుగానే బదులివ్వడం రెండు దేశాల మధ్య యుద్దానికి దారితీసే పరిస్థితులను తలపిస్తోంది. తమ దేశం సైనిక సహనాన్ని కోల్పోయిందని అమెరికాకు ఉత్తరకొరియా తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఎలాంటి అణ్వస్త్ర దాడినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని శనివారం నాడు ప్రకటించింది.
అణ్వస్త్ర ప్రయోగం జరగవచ్చన్న వార్తలతో:
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ తన తాత, ఉత్తరకొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ ఇల్ సంగ్ 105వ జయంతి (ఏప్రిల్ 15) సందర్భంగా ఈ అణు ప్రయోగం నిర్వహించవచ్చని వార్తలు రావడంతో ఇరు దేశాలు పరస్పరం హెచ్చరికలు చేసుకునేదాకా పరిస్థితి వచ్చింది.
జయంతి సందర్భంగా భారీ మిలిటరీ డ్రిల్ నిర్వహిస్తే పర్వాలేదని... అణ్వస్త్ర పరీక్ష నిర్వహిస్తే మాత్రం సిరియాపై దాడి చేసినట్టుగానే, ఉత్తరకొరియాపై దాడి చేసే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ సలహాదారు హెచ్చరించడంతో.. ఇప్పుడు ఉత్తరకొరియా అధికారి ఒకరు ఈ వ్యాఖ్యలకు బదులిచ్చారు.
యుద్దానికి యుద్దంతోనే సమాధానం:
ఈరోజు కిమ్ ఇల్ సంగ్ 105వ జయంతి సందర్బంగా సైనిక పరేడ్ నిర్వహించిన అనంతరం ఉత్తరకొరియా ప్రభుత్వంలోని ద్వితీయ శ్రేణి అధికారి ప్రతినిధి చో రియాంగ్ హే మాట్లాడారు. యుద్దానికి యుద్దంతోనే బదులిచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.
చో రియాంగ్ ఈ ప్రకటన చేస్తున్న సమయంలో అదే వేదికపై ఉన్న అధ్యక్షుడు కిమ్ జాంగ్ చేతిలో చుట్టతో దరహాసంగా నవ్వుతూ సైనికాధికారులతో ముచ్చటిస్తూ కనిపించారు. తాడాంగాంగ్ నది పక్కనే ఈ సైనిక పరేడ్ నిర్వహించారు.
ఈ యుద్దంతో విజేతలు ఉండరు: చైనా
ఉత్తరకొరియా అమెరికాల మధ్య యుద్దం గనుక జరిగితే ఇందులో విజేతలు ఉండబోరని, యుద్ద ఫలితం పెను విధ్వంసమే అవుతుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి అన్నారు. ఉత్తరకొరియా-అమెరికా మధ్య చర్చల కోసం తాము మధ్యవర్తిగా వ్యవహరించేందుకు సిద్దంగా ఉన్నామని చైనా ప్రకటించింది.
ఆరోసారి కూడా ఉత్తరకొరియా అణ్వస్త్ర పరీక్షలకు పాల్పడితే.. ఆ ప్రభావం చైనాపై కూడా పడుతుందని వాంగ్ యి తెలిపారు. ఉత్తరకొరియా అణ్వస్త్ర ప్రయోగానికి పాల్పడితే ఆ దేశంపై అమెరికా క్షిపణి దాడులు చేస్తుందని, కొరియా ద్వీపంలో యుద్దం చైనాకు కూడా నష్టం చేకూరుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.