Palestine: పాలస్తీనాకు గుడ్ న్యూస్ చెప్పిన నార్వే-అదే బాటలో స్పెయిన్, ఐర్లాండ్..!
పాలస్తీనా ప్రాంతంలో యూదుల ఎంట్రీ, పాశ్చాత్య దేశాల సహకారంతో ఇజ్రాయెల్ దేశం ఏర్పాటు తర్వాత రగులుతున్న దశాబ్దాల చిచ్చుకు తెరదించే దిశగా గొప్ప అడుగు పడింది. ప్రత్యేక పాలస్తీనా దేశం కోసం ఎప్పటి నుంచో జరుగుతున్న పోరాటానికి మద్దతివ్వని పాశ్చాత్య దేశాలు.. ఇజ్రాయెల్ ను మాత్రం గుర్తించి, ఆ దేశానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నాయి. దీంతో ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో పాలస్తీనాకు గుర్తింపు ఇచ్చేందుకు పలు దేశాలు ముందుకొచ్చాయి.
ఇజ్రాయెల్ తో నెలకొన్న సంక్షోభానికి తెరదించే విధంగా పాలస్తీనాకు ప్రత్యేక దేశంగా గుర్తింపు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు నార్వే ఇవాళ ప్రకటించింది. ఈ మేరకు నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోర్ ఓ ప్రకటన చేశారు. గుర్తింపు లేకపోతే మధ్యప్రాచ్యంలో శాంతి ఉండదంటూ నార్వే ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. స్వతంత్ర పాలస్తీనా దేశానికి ఈ నెల 28న గుర్తింపు ఇవ్వనున్నట్లు ఈ స్కాండినేవియా దేశం చేసిన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది.

పాలస్తీనా సంక్షోభానికి తెరదించేందుకు ఆ దేశానికి గుర్తింపు ఇచ్చేందుకు సిద్దమని ఇప్పటికే పలు యూరోపియన్ దేశాలు ప్రకటించిన నేపథ్యంలో నార్వే ఈ ప్రకటన చేసింది. ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి కోసం ఈ దేశాలు రెండు దేశాల పరిష్కార ప్రతిపాదనను ముందుకు తెచ్చాయి. యూరోపియన్ యూనియన్ సభ్యత్వానికి దూరంగా ఉన్నప్పటికీ, నార్వే ఈ అడుగు వేసింది. ఏడు నెలల క్రితం ప్రారంభమైన ఇజ్రాయెల్, హమాస్ ఘర్షణ నేపథ్యంలో నార్వే దీని పరిష్కారానికి పలు ప్రయత్నాలు చేస్తోంది.
నార్వే ప్రకటన తర్వాత స్పెయిన్, ఐర్లాండ్ కూడా ఇదే బాట పట్టాయి. 1993లో మొదటి ఓస్లో ఒప్పందంపై సంతకం చేసిన దాదాపు 30 సంవత్సరాల తర్వాత పాలస్తీనా రాష్ట్రంగా నార్వే గుర్తింపు పొందింది. నార్వే తాజా ప్రకటన నేపథ్యంలో స్పెయిన్,, ఐర్లాండ్ కూడా ఇదే తరహాలో ప్రకటనలు చేసేందుకు సిద్దమవుతున్నాయి. వాస్తవానికి ఐక్యరాజ్యసమితిలోని కనీసం 140 మంది సభ్యులు ఇప్పటికే పాలస్తీనా దేశాన్ని గుర్తించారు. కానీ అమెరికా, బ్రిటన్ సహా వారి మిత్రరాజ్యాలు మాత్రం గుర్తించడం లేదు.పాలస్తీనాకు 2012 నుండి ఐరాస సాధారణ సభలో సభ్యరహిత పరిశీలక దేశ హోదా కూడా ఉంది.












Click it and Unblock the Notifications