నుపుర్ శర్మ వ్యాఖ్యల చిచ్చు-భారతీయ ఉత్పత్తుల బాయ్ కాట్- గల్ఫ్ దేశాల్లో పిలుపు
బీజేపీ అధికార ప్రతినిధులు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ మహమ్మద్ ప్రవక్తను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ముస్లిం దేశాల్లో ఆగ్రహానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా మహమ్మద్ ప్రవక్తపై ఈ ఇరువురు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్న గల్భ్ దేశాలు.. భారత రాయబారుల్ని పిలిపించుకుని మరీ నిరసన తెలిపాయి. ఇంతటితో ఈ వ్యవహారం ఆగేలా కనిపించడం లేదు.
మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు నూపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇస్లామిక్ దేశాల్లో దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చిన హ్యాష్ట్యాగ్లు ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నాయి. ఒమన్ గ్రాండ్ ముఫ్తీ షేక్ అల్-ఖలీలీ భారత అధికార పార్టీ అధికార ప్రతినిధి "అసభ్యకరమైన" వ్యాఖ్యలు "ప్రతి ముస్లింపై యుద్ధం" అని ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై కూడా ట్వీట్లు చేశారు. సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలలో చాలా సూపర్ స్టోర్లు భారతీయ ఉత్పత్తులను తమ షెల్ఫ్ల నుండి తొలగిస్తున్నాయి.
ఖతార్, కువైట్ దేశాలు నిన్న భారత రాయబారులను పిలిపించి ప్రవక్త మహమ్మద్పై బిజెపి నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తమ నిరసన తెలిపాయి. కువైట్లోని భారత రాయబారిని ఆదివారం పిలిపించి అధికార బీజేపీ ప్రతినిధిీ చేసిన ప్రకటనలను కువైట్ నిరసన వ్యక్తం చేస్తూ ఆసియా వ్యవహారాల సహాయ కార్యదర్శి అధికారిక నిరసన నోట్ను అందజేసినట్లు కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో గల్ఫ్ దేశాల్లో పౌరులు బీజేపీ ప్రతినిధుల వ్యాఖ్యల్ని తప్పుబడుతూ భారత ఉత్పత్తుల్ని బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు.