అమెరికాలో కాల్పుల బీభత్సం... ఐదుగురు చిన్నారులు సహా ఆరుగురు మృతి...
అమెరికాలోని ఓక్లాహామా రాష్ట్రంలో దారుణం జరిగింది. మస్కోజీ నగరంలోని ఓ ఇంట్లోకి చొరబడ్డ అగంతకుడు ఐదుగురు పిల్లలు సహా మొత్తం ఆరుగురిని కాల్చి చంపాడు. మరో మహిళకు తీవ్ర బుల్లెట్ గాయాలయ్యాయి. అయితే ఆ అగంతకుడు ఎవరు... ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడన్నది ఇంకా తెలియరాలేదు. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు అగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు.
సోమవారం అర్ధరాత్రి దాటాక 1.30గంటల సమయంలో ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి చేరుకునేసరికి ఓ వ్యక్తి చేతిలో గన్తో కనిపించాడు. దీంతో పోలీసులు వెంటనే ఫైరింగ్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో అతను తప్పించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. అనంతరం అతన్ని జైలుకు తరలించారు.
Recommended Video
ఆ ఇంట్లోకి వెళ్లి చూస్తే నలుగురు చిన్నారులతో పాటు ఒక వ్యక్తి కాల్పుల్లో చనిపోయి కనిపించారని పోలీసులు తెలిపారు. మరో చిన్నారి కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతుండగా ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. అయినప్పటికీ లాభం లేకపోయిందని... పరిస్థితి విషమించడంతో ఆ చిన్నారని మృతి చెందిందని చెప్పారు. గాయపడ్డ మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని... మృతుల వివరాలు కూడా తెలియాల్సి ఉందని చెప్పారు.