అట్టుడుకుతున్న అమెరికా: మళ్లీ చెలరేగిన హింస: ఒకరి మృతి: ట్రంప్-బిడెన్ మధ్య
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. మరోసారి ఘర్షణలు చెలరేగాయి. దాడులు, ప్రతిదాడులతో ఒరెగాన్ స్టేట్లోని పోర్ట్ల్యాండ్ సిటీ అట్టుడికిపోయింది. అల్లర్లను నివారించడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన కాస్త రాజకీయ రంగు పులుముకొంది. అమెరికా అధ్యక్షుడు, రెండోసారి రిపబ్లికన్ల తరఫున పోటీ చేస్తోన్న డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఈ పరిణామాలతో అమెరికా ఒక్కసారిగా వేడెక్కింది.

ట్రంప్ మద్దతుదారులు..బీఎల్ఎం ఆందోళనకారుల మధ్య..
అమెరికాలో ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ పోలీసుల చేతుల్లో మరణించిన అనంతరం తరచూ నల్లజాతీయులు బ్లాక్ లైవ్స్ మ్యాటర్ (బీఎల్ఎం) పేరుతో ఆందోళనలు, ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల కిందట విస్కాన్సిన్లో జాకబ్ బ్లేక్ అనే నల్లజాతీయుడిపైనా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ రెండు ఉదంతాలతో అమెరికాలో నివసిస్తోన్న ఆఫ్రికన్ అమెరికన్లు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. నెలరోజులుగా పోర్ట్ల్యాండ్లో తరచూ నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చెలరేగుతూనే వస్తున్నాయి.

పోర్ట్ల్యాండ్లో నిరసన ప్రదర్శనలు..
పోర్ట్ల్యాండ్లో బీఎల్ఎం పేరుతో నల్లజాతీయులు భారీ ఆందోళనలు చేపట్టారు. ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ట్రంప్కు వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శించారు. 600 వాహనాలతో డౌన్టౌన్ పోర్ట్ల్యాండ్లో వందలాది మంది బీఎల్ఎం ఆందోళనకారులు ఇందులో పాల్గొన్నారు. అదే సమయంలో ట్రంప్ మద్దతుదారులు ఆయనకు అనుకూలంగా ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నించడం ఘర్షణలకు దారి తీసింది.

పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి
ట్రంప్ మద్దతుదారులు, బీఎల్ఎం ఆందోళనకారుల మధ్య ఘర్షణల తలెత్తింది. పరస్పరం దాడులు, ప్రతిదాడులకు దిగారు. వీధి పోరాటానికి దిగారు. డౌన్టౌన్ పోర్ట్ల్యాండ్లోని సౌత్ ఈస్ట్ ఆల్డర్ స్ట్రీట్, థర్డ్ అవెన్యూ ప్రాంతాలు ఘర్షణలతో అట్టుడికిపోయాయి. అల్లర్లను నివారించడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు దుర్మరణం పాలయ్యారు. ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించారు. మూడుసార్లు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చిందని, అప్పటికీ అల్లర్లు అదుపులోకి రాలేదని పోర్ట్ల్యాండ్ పోలీస్ బ్యురో ఓ ప్రకటనలో వెల్లడించింది. బుల్లెట్ గాయాలతో ఒకరు మరణించారని స్పష్టం చేసింది.

ట్రంప్, జో బిడెన మధ్య..
ఈ ఘటన ట్రంప్, జో బిడెన్ మధ్య మాటల యుద్ధానికి కేంద్రబిందువైంది. డెమొక్రాట్లకు చెందిన పోర్ట్ల్యాండ్ మేయర్ టెడ్ వీలర్ ఉద్దేశపూరకంగా ఈ దాడులకు ప్రేరేపించారంటూ డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. శాంతికాముకులైన పోర్ట్ల్యాండ్ ప్రజలను రాడికల్ డెమొక్రాట్లు రెచ్చగొట్టారని విమర్శించారు. మరోవంక- జో బిడెన్ ఈ దాడులపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అమెరికన్లకు అమెరికన్లే శతృవులుగా ట్రంప్ ప్రభుత్వం తయారు చేసిందని, దాని ఫలితంగానే ఈ దాడులు చోటు చేసుకున్నాయని విమర్శించారు.
Recommended Video

అధ్యక్ష ఎన్నికల సమయంలో..
నవంబర్లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలను నిర్వహించనున్నారు. డెమొక్రాట్ల తరఫున జో బిడెన్ పోటీ చేస్తోండగా.. రిపబ్లికన్ల అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఎన్నికలు సమీపిస్తోన్న కొద్దీ బీఎల్ఎం ఆందోళనలు మరింత ఉధృతమౌతున్నాయి. ట్రంప్కు వ్యతిరేకంగా నల్లజాతీయులు ఏకం అయ్యారని, అందువల్లే తరచూ ఆందోళనలు, నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. జార్జ్ ఫ్లాయిడ్, జాకబ్ బ్లేక్ ఉదంతాలతో పాటు తాజాగా పోర్ట్ల్యాండ్లో చోటు చేసుకున్న నిరసన ప్రదర్శనలు మరింత ఉధృతం అయ్యే అవకాశాలు లేకపోలేదనే అంచనాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications