Operation Sindoor: భారత్ మెరుపు దాడులపై ట్రంప్ రియాక్షన్ ఇదే..!!
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో రక్తం పారించిన ఉగ్రవాదులకు భారత సైన్యం ధీటైన, ఊహించని జవాబిచ్చింది! ఆ దారుణ మారణహోమంలో అమాయకుల హాహాకారాలు ఇంకా చెవుల్లో మార్మోగుతుండగానే, వారి ప్రాణాలు బలిగొన్న పాక్ ప్రేరేపిత ఉగ్ర మూకలపై భారత సాయుధ బలగాలు ఉక్కు పిడికిలి బిగించాయి. బుధవారం, మే 7న చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్'తో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లలోని కీలక ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు జరిపి, ఉగ్రవాద లోకంలో తీవ్ర వణుకు పుట్టించింది. ఈ సాహసోపేత చర్యపై ప్రపంచ దేశాలు స్పందించాయి. ముఖ్యంగా అమెరికా నుంచి వచ్చిన ప్రకటనలు అత్యంత కీలకంగా మారాయి.
ట్రంప్ తొలి స్పందన
పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ దాడులు చేసినట్లు భారత రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించిన వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మొదటి స్పందనను వెల్లడించారు. 78 ఏళ్ల ట్రంప్ మంగళవారం (భారత్ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం) మీడియాతో మాట్లాడుతూ, పహల్గాంలో జరిగిన తాజా దాడిపై ప్రశ్నించగా, తనదైన శైలిలో స్పందించారు.
ఇది చాలా సిగ్గుచేటు వ్యవహారమని ట్రంప్ అన్నారు. తాము దాడుల గురించి ఓవల్ ఆఫీస్ డోర్స్ లోపలికి వెళ్తుండగానే వార్త విన్నట్లు ఆయన తెలిపారు.గతం బట్టి చూస్తే ఏదో జరగబోతుందని కొంతమందికి తెలుసు అనుకుంటున్నానని చెప్పిన ట్రంప్...భారత్ పాక్ దేశాల మధ్య చాలా కాలంగా ఘర్షణ వాతావరణం నెలకొని ఉందని అన్నారు .దశాబ్దాలుగా,శతాబ్దాలుగా ఇది ఉందని గుర్తు చేసిన ట్రంప్..ఇది చాలా త్వరగా ముగిసిపోవాలని ఆకాంక్షించారు.భారత్ చేపట్టిన చర్యపై ఆయన నేరుగా వ్యాఖ్యానించకపోయినా, మొత్తం సంఘర్షణ త్వరగా ముగిసిపోవాలన్న తన ఆకాంక్షను తెలియజేశారు.

భారత్కు అగ్రరాజ్యం అండగా నిలుస్తుందన్న జాన్సన్:
ట్రంప్ వ్యాఖ్యలకు కొద్ది సమయం ముందు, అమెరికా హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ కీలక ప్రకటన చేశారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న ధైర్యసాహస పోరాటానికి అమెరికా అండగా నిలుస్తుందని ఆయన బలంగా ప్రకటించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో న్యూఢిల్లీకి అవసరమైన అన్ని శక్తి, వనరులను అందించడానికి వాషింగ్టన్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
Reporter: Any reaction to the attacks between India and Pakistan?
— Acyn (@Acyn) May 6, 2025
Trump: It's a shame. We just heard about it as we were walking in the doors of the oval. Just heard about it. I guess people knew something was going to happen based on a little bit of the past. They've been… pic.twitter.com/lGfWsEZNuL
భారత్ అధికారిక ప్రకటన
'ఆపరేషన్ సింధూర్'కు సంబంధించి భారత ప్రభుత్వం తరపు నుంచి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఒక అధికారిక పత్రికా ప్రకటన విడుదల చేసింది. పాకిస్థాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలపై ఈ ఆపరేషన్ జరిగిందని నిర్ధారించింది. భారత సైన్యం తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా దేశ ప్రజలకు భరోసా ఇస్తూ, ఉగ్ర మూకలకు గట్టి సందేశం పంపింది: "న్యాయం జరిగింది. జై హింద్!" అని పోస్ట్ చేసింది.
పీఐబీ ప్రకటన ప్రకారం, దాడులు తొమ్మిది నిర్దిష్ట స్థావరాలపై జరిగాయి. ఈ చర్య ఒక కొలతతో కూడినదని, ఉద్రిక్తతలను మరింత పెంచేలా కాదని స్పష్టం చేసింది. "ఎక్కడా పాకిస్థాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదు. లక్ష్యాల ఎంపిక మరియు అమలు పద్ధతిలో భారతదేశం అద్భుతమైన సంయమనాన్ని చూపింది" అని అందులో పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో దృఢ సంకల్పాన్ని చూపుతూనే, బాధ్యతాయుతమైన వైఖరిని ప్రదర్శించామని భారత్ ప్రపంచానికి చాటింది.
పహల్గాం దుర్ఘటన తాలూకు గాయాలు ఇంకా మానక ముందే, భారత్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తన పోరాట పటిమను నిరూపించింది. అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న సానుకూల స్పందనలు, ముఖ్యంగా అగ్రరాజ్యమైన అమెరికా నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుండటంతో, ఉగ్రవాదాన్ని భూస్థాపితం చేసే వరకు భారత్ వెనకడుగు వేయదని స్పష్టమవుతోంది.












Click it and Unblock the Notifications