భారత్ దాడిని తిప్పికొడదామనుకున్నాం కానీ, చీకటి ఉంది: పాకిస్తాన్ రక్షణ మంత్రి, కన్ఫ్యూజన్లో దాయాది
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పుల్వామా దాడి తర్వాత పన్నెండో రోజు పాకిస్తాన్ స్థావరాల్లోకి వెళ్లిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉగ్రవాద స్థావరాలను నాశనం చేశాయి. ఈ దాడిలో వందలమంది తీవ్రవాదులు చనిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే, పాకిస్తాన్ తీరు మేకపోతు గాంభీర్యంలా కనిపిస్తోంది. అలాగే కన్ఫ్యూజన్లో ఉన్నట్లుగా కూడా అర్థమవుతోందని అంటున్నారు.
పాక్ రక్షణ శాఖ వ్యాఖ్యలపై నవ్వుకుంటున్నారట
భారత వైమానిక దళం మంగళవారం వేకువజామున 3.30 గంటల నుంచి 21 నిమిషాల పాటు ఈ ఆపరేషన్ నిర్వహించింది. భారత్కు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు పాక్ సైన్యం కూడా సిద్ధమైందట. కానీ భారత్ దాడులను తిప్పికొట్టేందుకు చీకటి అడ్డు వచ్చిందని చెబుతోంది. పాక్ రక్షణ శాఖ మంత్రి పర్వేజ్ ఖట్టక్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ దాడులను తిప్పికొట్టేందుకు చీకటిని అడ్డుపెట్టుకోవడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అయితే, పాక్ దళాలు భారత్ దాడిని తిప్పికొట్టేందుకు సిద్ధమయ్యాయి. కానీ భారత్ వాయుదళాల ఫార్మేషన్ చూసి వెనక్కి వెళ్లాయి.
ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నాలు
బాలాకోట్.. జైష్ ఏ మొహమ్మద్కు కీలక, ప్రధాన ఉగ్రవాద స్థావరం. ఇక్కడ ఆరేడు ఎకరాల్లో ఉగ్రవాద శిక్షణ ఇస్తుంటారు. భారత్ వాయు సేన దాడి అనంతరం పాకిస్తాన్ బాలాకోట్ను తమ ఆదీనంలోకి తీసుకుంది. భారత్ దాడి నేపథ్యంలో అక్కడి ఉగ్రవాద జాడలు ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటోందట. ఈ మేరకు అక్కడ ఉన్న సామాగ్రిని మొత్తం తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. తద్వారా అంతర్జాతీయ సమాజానికి ఉగ్రవాదులను మట్టుబెట్టలేదని, తద్వారా తమ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు లేవని చెప్పే ప్రయత్నాలు చేస్తోందట. ఓ వైపు తమకు నష్టమేమీ జరగలేదని చెబుతూనే, బాలాకోట్ ప్రాంతంలో అంతా శుభ్రం చేసే పనిలో పడిందట.
చైనా చేయూత అంతంతే
పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత్ వాయుసేన దాడి చేసింది. ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టింది. ఈ దాడి గురించి భారత్.. అమెరికాకు ముందే సమాచారం ఇచ్చింది. ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టినందున దాదాపు ప్రపంచ దేశాలు భారత్ వైపు ఉంటాయి. ప్రతి విషయంలో పాకిస్తాన్ను వెనుకేసుకు వచ్చే చైనా కూడా ఇప్పుడు ఆచితూచి వ్యవహరిస్తోందట. పాకిస్తాన్కు పూర్తిగా హామీ ఇవ్వడం లేదట. భారత్ దెబ్బకు పాకిస్తాన్ పూర్తిగా కన్ఫ్యూజన్లో పడిపోయిందని అంటున్నారు. తమ దేశంలోకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వచ్చిందని ఐక్య రాజ్య సమితిని పాక్ సంప్రదించనుంది.