జైలు గొడలు బద్దలు: 350 మంది ఖైదీలు ఎస్కేప్
కాబూల్: తాలిబన్ ఉగ్రవాదులు రెచ్చిపోవడంతో ఆఫ్ఘనిస్థాన్ లోని ఒక జైలులో ఉన్న ఖైదీలు అక్కడి నుంచి పరారైనారు. విషయం తెలుసుకున్న పోలీసులు, సైన్యం తప్పించుకున్న ఖైదీల కోసం గాలిస్తున్నారు.
భారత కాలమానం ప్రకారం సోమవారం వేకువ జామున రెండు గంటల సమయంలో తాలిబన్ ఉగ్రవాది ఒక కారులో బాంబులు వేసుకుని ఘజ్ని ప్రావిన్స్ ప్రాంతంలోని జైలు దగ్గరకు వెళ్లాడు. తరువాత జైలు ప్రధాన ద్వారాన్ని ఆ కారుతో డీకొనడంతో గోడలు పేలిపోయాయి.
అదే సమయంలో పోలీసు దుస్తులు వేసుకున్న ఆరుగురు తాలిబన్ ఉగ్రవాదులు జైలులోకి చొరబడ్డారు. జైలు ఆవరణంలో ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరిపి నానా హంగామా చేశారు. ఈ కాల్పులు జరుగుతున్న సమయంలో ఖైదీలు అక్కడి నుంచి పరారైనారు.

తరువాత ఉగ్రవాదులు దర్జాగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పులలో నలుగురు జైలు సిబ్బంది, నలుగురు భద్రతా సిబ్బంది, 10 మంది ఖైదీలు మరణించారని కాబూల్ అధికారులు వెల్లడించారు.
తాలిబన్ల మీద దాడులు జరిపినందుకు ప్రతీకారంగా ఉగ్రవాదులు జైలు మీద దాడి చేసి ఉంటారని ఘజ్ని డిప్యూటి గవర్నర్ మోహమ్మద్ ఆలీ అహమ్మద్ అనుమానం వ్యక్తం చేశారు. జైలులో ఉన్న తాలిబన్ ఉగ్రవాదులు ఇదే సందర్బంలో తప్పించుకున్నారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications