తాలిబన్లపై భారత్ దే పైచేయి-ఎక్కడికక్కడ చెక్-రష్యా, చైనా సహా బ్రిక్స్ దేశాల కీలక మద్దతు
ఆప్ఘనిస్తాన్ లో వేగంగా మారిపోతున్న పరిణామాలు అంతర్జాతీయంగా పలు దేశాల్ని కలవరపెడుతున్నాయి. ఇందులో భారత్ కూడా ఉంది. ఆప్ఘన్ గడ్డపై తాలిబన్ల రాకతో అల్ ఖైదా సహా పలు ఉగ్రవాద సంస్ధలు తిరిగి విజృంభించే ప్రమాదం ఉందని భావిస్తున్న భారత్.. తన ఆందోళనల్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళుతోంది. దీంతో పలు దేశాలు భారత్ కు మద్దతునిచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. తాజాగా జరిగిన బ్రిక్స్ సదస్సు కూడా ఆప్గన్ గడ్డపై నుంచి తీవ్రవాద కార్యకలాపాలను అనుమతించబోమని తేల్చిచెప్పేయడం తాలిబన్లకు ఎదురుదెబ్బగా మారింది.
ఆప్ఘన్ లో తాలిబన్ల పాలన
ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం స్ధానంలో మరో రెండు రోజుల్లో తాలిబన్లు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో ఎవరెవరు ఉండబోతున్నారో కూడా తాలిబన్లు ఇప్పటికే ప్రకటించేశారు. తాలిబన్ల కొత్త ప్రభుత్వంలో హక్కానీ నెట్ వర్క్ కు చెందిన నలుగురు నేతలకు స్ధానం కల్పిస్తున్నారు. తద్వారా అంతర్జాతీయ సమాజానికి వారు సవాల్ విసురుతున్నట్లు కనిపిస్తోంది. గతంలో తాలిబన్లకు మద్దతుగా పలు దాడులు నిర్వహించిన చరిత్ర ఉన్న హక్కానీలకు కొత్త ప్రభుత్వంతో స్ధానం కల్పించడం ద్వారా భవిష్యత్తు ఎలా ఉండబోతోందో తాలిబన్లు చెప్పేశారు. దీంతో అంతర్జాతీయ గుర్తింపు కోసం వారు చేస్తున్న ప్రయత్నాలకు ఇదో విఘాతంగా మారబోతోంది.
తాలిబన్ల సర్కార్ కు అంతర్జాతీయ గుర్తింపు
తాలిబన్లు ఏర్పాటు చేయబోయే కొత్త ప్రభుత్వానికి అంతర్జాతీయంగా గుర్తింపు తప్పనిసరి. లేకపోతే 2001లో చోటు చేసుకున్న పరిణామాలు పునరావృతం కావడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే వీలైనన్ని ఎక్కువ దేశాలతో గుర్తింపు ఇచ్చేలా వారు చర్చలు జరుపుతున్నారు. మా ప్రభుత్వాన్ని గుర్తించండి చాలు మీరు చెప్పినట్లు నడుచుకుంటామని ఆఫర్లు చేస్తున్నారు. అదే సమయంలో తమ సహజ ధోరణిని వదులుకునేందుకు మాత్రం తాలిబన్లు ఇష్టపడటం లేదు. ముఖ్యంగా ప్రభుత్వంలో మహిళలకు స్ధానం కల్పించడం, తీవ్రవాద గ్రూపుల్ని అధికారానికి దూరంగా ఉంచడం వంటి చర్యలు చేపట్టేందుకు తాలిబన్లు ఇష్టపడటం లేదు. అన్నింటికీ మించి ప్రజా స్వామ్య పాలన సాగించేందుకు తాము సిద్ధంగా లేమని కూడా తేల్చేశారు. ఈ పరిణామాల ప్రభావం సహజంగానే వారి ప్రభుత్వానికి అంతర్జాతీయ గుర్తింపుపై పడుతోంది.
భారత్ ఆందోళన
ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటులో వారు గతంలో ఇచ్చిన హామీలు అమలవుతాయేమోనని ఎదురుచూసిన భారత్ కు నిరాశ తప్పలేదు. హక్కానీ నెట్ వర్క్ సభ్యులకు ప్రభుత్వంలో స్ధానం కల్పించడం, పాకిస్తాన్ మద్దతు తీసుకోవడం, ఆప్ఘనిస్తాన్ లో పాకిస్తాన్ వ్యతిరేక చర్యలపై ఉక్కుపాదం మోపడం వంటి చర్యలు భారత్ లో ఆందోళన పెంచుతున్నాయి. గతంలో ప్రజా ప్రభుత్వం ఉన్న సమయంలో అక్కడి ప్రజలు అనుభవించిన స్వేచ్చను వారికి దూరం చేయడంతో పాటు విద్య, వినోదం వంటి విషయాల్లో తాలిబన్లు పెడుతున్న కట్టుబాట్లు ఇప్పుడు భారత్ కు ఆందోళన కలిగిస్తున్నాయి. వాస్తవానికి వీటి ప్రభావం అక్కడి ప్రజలపైనే ఉంటుందని భావిస్తున్నా, భవిష్యత్తులో అవే చర్యలు తాలిబన్లు ఆప్ఘన్ వెలుపల కూడా చేసేందుకు ప్రయత్నిస్తారన్న ప్రచారమే ఇందుకు కారణం.
తాలిబన్లకు చెక్ పెట్టే ప్రయత్నాలు
ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్లు అనుసరిస్తున్న ధోరణులతో పాటు ఆప్ఘన్ భూభాగంపై భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ఉగ్రవాదులకు ప్రోత్సాహం విషయంలో మన దేశం ఆగ్రహంగా ఉంది. దీంతో తాలిబన్లకు ఇప్పుడే ముకుతాడు వేయాలనే పట్టుదలతో పావులు కదుపుతోంది. ముఖ్యంగా ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్లు ఏర్పాటు చేస్తున్న కొత్త ప్రభుత్వానికి అంతర్జాతీయ సమాజం నుంచి గుర్తింపు దక్కకుండా చేయాలనే ప్రయత్నాలతో పాటు తాలిబన్లకు ఆప్ఘన్ కే పరిమితం చేయాలన్న ప్రయత్నాల్ని కూడా ముమ్మరం చేస్తోంది. ఈ మేరకు రష్యా జాతీయ భద్రతా సలహాదారుతో ఇప్పటికే జరిపిన చర్చలు ఫలించాయి. ఇదే కోవలో తాజాగా రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ భాగస్వాములుగా ఉన్న బ్రిక్స్ సదస్సులోనూ భారత్ వారిని ఈ మేరకు ఒప్పించగలిగింది. తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటుకు గుర్తింపు నిరాకరణపై గట్టి హామీ రాకపోయినా ఆప్ఘన్ గడ్డపై నుంచి తీవ్రవాద కార్యకలాపాల్ని అడ్డుకునే విషయంలో మాత్రం హామీ లభించినట్లు తెలుస్తోంది. దీంతో భారత్ కు ఇదో గొప్ప ఊరటగా మారింది.
తాలిబన్లకు బ్రిక్స్ సదస్సు భారీ షాక్
ఆప్ఘనిస్తాన్ లో పాలనా పగ్గాలు చేపట్టబోతున్న తాలిబన్లు కొత్త ప్రభుత్వంలో హక్కానీ నెట్ వర్క్ లకు స్ధానం కల్పించడం ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు ఊతమిచ్చిందని భారత్ భావిస్తోంది. దీంతో ఆప్ఘన్ గడ్డపై నుుంచి విదేశాలపై ఎలాంటి దాడులకూ అనుమతించబోమని తేల్చిచెప్పింది. దీంతో రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ కూడా మద్దతు ఇవ్వడంతో బ్రిక్స్ సదస్సులో భారత్ వాదన నెగ్గినట్లయింది. ఉగ్రవాదులు ఆప్ఘన్ సరిహద్దులు దాటకుండా చర్యలు తీసుకోవాలని బ్రిక్స్ సదస్సు తీర్మానించింది. దీనికి రష్యా, చైనా నుంచి వ్యతిరేకత లేకపోవడంతో భారత్ వాదన నెగ్గినట్లయింది. అదే సమయంలో తీవ్రవాదులతో సంబంధాలు నెరుపుతున్న తాలిబన్లకు భారీ షాక్ గా మారింది.
Recommended Video
ఆప్ఘన్ పై భారత్ కోరుకున్నదే జరుగుతోందా ?
గతంలో ఆప్ఘనిస్తాన్లో తాలిబన్ల సర్కార్ ను కూలదోసి అమెరికా మద్దతుతో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో కీలకపాత్ర పోషించిన భారత్.. గత రెండు దశాబ్దాలుగా అక్కడ తన హవా కొనసాగిస్తోంది. అందుకే భారీ ఎత్తున పెట్టుబడులు కూడా పెట్టింది. తాజాగా మళ్లీ తాలిబన్ల పాలన రావడంతో భారత్ పప్పులు ఉడకవన్న ప్రచారం మొదలైంది. దీంతో భారత్ ఇప్పుడు అంతర్జాతీయ మద్దతు కోరుతోంది. ఆ మేరకు ఆప్ఘన్ భూభాగం ఉగ్రదాడులకు కేంద్రం కాకూడదన్న భారత్ కోరికకు ప్రపంచ దేశాల నుంచి మద్దతు పెరుగుతోంది. దీంతో భారత్ ఇప్పుడు ఈ వ్యవహారాన్ని అంతర్జాతీయ స్ధాయిలోనూ వినిపించబోతోంది. భద్రతా మండలి సభ్యదేశంగా ఐక్యరాజ్యసమితిలోనూ ఆప్ఘన్ గడ్డపై నుంచి తీవ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేయబోతోంది. ఈ మేరకు ఓ తీర్మానం ఆమోదింపజేయాలని భారత్ పిలుపునిచ్చింది.