గుండెపోటు వచ్చింది..ప్రాణాల కోసం నవాజ్ షరీఫ్ పోరాడుతున్నారు: డాక్టర్లు
లాహోర్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తన ప్రాణాల కోసం పోరాడుతున్నట్లు షరీఫ్కు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. అవినీతి కేసులో జైలు జీవితం గడుపుతున్న నవాజ్ షరీఫ్ అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సమయంలోనే స్వల్ప గుండెపోటు రావడంతో పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. తమ ప్రయత్నాలు తాము చేస్తున్నట్లు వైద్యులు చెప్పారు. . లాహోర్లోని ఓ హాస్పిటల్లో నవాజ్ షరీఫ్ చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం కారణాలపై ఆయనకు నిరవధిక బెయిల్ను ఇస్లామాబాదు కోర్టు మంజూరు చేసింది. అయితే నవాజ్ షరీఫ్ను దేశంలోనే ఉంచి చికిత్స అందించాలంటూ కోర్టు తెలిపింది.
స్వల్ప గుండెపోటు రావడంతో నవాజ్ షరీఫ్ పరిస్థితి మరింత విషమించిందని చెప్పారు ఆయన వ్యక్తిగత వైద్యుడు అద్నాన్ ఖాన్. నవాజ్ షరీఫ్కు రక్తకణాల సంఖ్య కూడా తగ్గిపోయాయని చెప్పారు. ఇది కిడ్నీపై ప్రభావం చూపే అవకాశం ఉందని డాక్టర్ తెలిపారు. ఇక బీపీ కూడా నియంత్రణలో ఉండటం లేదని వైద్యులు చెప్పారు. కొంత సమయం గడిస్తేకానీ నవాజ్ షరీఫ్ ఆరోగ్య పరిస్థితిపై ఒక ప్రకటన చేయలేమని వైద్యులు చెప్పారు.
నవాజ్ షరీఫ్ను పంజాబ్ సింహంగా పిలుస్తారు. జైలులో శిక్ష అనుభవిస్తుండగా నవాజ్ షరీఫ్ అనారోగ్యానికి గురయ్యారు. రక్త కణాల సంఖ్య తగ్గిపోవడంతో ఆయన్ను వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. 2017లో నవాజ్ షరీఫ్పై అవినీతి ఆరోపణలు రావడంతో పాకిస్తాన్ సుప్రీంకోర్టు రాజకీయాల్లో ఇక ఆయన ఉండరాదంటే జీవితకాలం నిషేధం విధించింది. ఆ తర్వాత ఏడేళ్లు జైలు శిక్షను విధిస్తూ తీర్పు వెలువరించింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమనీ కావాలనే పాకిస్తాన్ మిలటరీ తనను ఇరికించిందని నవాజ్ షరీఫ్ చెప్పారు. మూడుసార్లు పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు నవాజ్ షరీఫ్.