హఫీజ్ సయీద్ను విచారణ చేయాల్సిందే: పాకిస్తాన్కు అమెరికా వార్నింగ్
వాషింగ్టన్ : ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ తర్వాత అగ్రరాజ్య ప్రభుత్వం పాకిస్తాన్ను హెచ్చరించింది. తమ భూభాగంపై ఉగ్రవాదాన్ని అంతం చేయాల్సిన బాధ్యత పాకిస్తాన్ తీసుకోవాలని సూచించింది. అంతేకాదు లష్కరేతోయిబా ఉగ్రసంస్థకు చెందిన ఉగ్రవాదులను వారి నాయకుడు హఫీజ్ సయీద్ను విచారణ చేయాలని డిమాండ్ చేసింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ సమావేశానికి ముందు అమెరికా ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉగ్రవాదులకు స్వర్గధామంగా నిలిచిన పాకిస్తాన్ను బ్లాక్లిస్టులో చేర్చాలా లేదా అనే అంశంపై అమెరికా యోచిస్తోంది.
అడుగు ముందుకు పడింది: ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ పై కేసు నమోదు చేసిన పాక్
నిధులను సమకూరుస్తుండటంపై నలుగురు అరెస్టు
గురువారం రోజున పాకిస్తాన్ లష్కరేతోయిబా, జమాత్ ఉద్ దవా ఉగ్రసంస్థలకు చెందిన నలుగురు అగ్రనాయకులను అరెస్టు చేసింది. వీరంతా ఉగ్రవాదంకు నిధులు సమకూరుస్తున్నారని పేర్కొంటూ పాక్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ప్రొఫెసర్ జాఫర్ ఇక్బాల్, యాహ్యా అజీజ్, మొహ్మద్ ఆష్రాఫ్, అబ్దుల్ సలాంలను అరెస్టు చేశాయి. పాక్ చేపట్టిన ఈ అరెస్టుల చర్యను అమెరికా ప్రభుత్వం స్వాగతించింది. అయితే వీరి అధినేతలను కూడా బోనులో నిలబెట్టి విచారణ చేయాలని డిమాండ్ చేసింది అమెరికా. ఈమేరకు అమెరికా ప్రభుత్వంలో ఉన్నతాధికారిణి అలీస్ వెల్స్ ట్వీట్ చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులను పట్టుకుని అరెస్టు చేయడం ఆ తర్వాత వదలడం పాక్ చరిత్రలో కొత్తేమీ కాదని అమెరికా పేర్కొంది.
హఫీజ్ సయీద్, మసూద్ అజార్లను విచారణ చేయాలి
పాకిస్తాన్ ప్రస్తుతం ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్టులో ఉంది. గతేడాది జూన్లో పారిస్ పాకిస్తాన్ను గ్రేలిస్టులో చేర్చింది. అక్టోబర్ 2019 నాటికి పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకోకుంటే ఇప్పటికే బ్లాక్లిస్టులో ఉన్న ఇరాన్, ఉత్తరకొరియాల సరసన చేరుస్తామని ప్యారిస్ హెచ్చరించింది. ప్రస్తుతం పాక్ పరిస్థితిని చాలా దగ్గరగా ప్యారిస్ సమీక్షిస్తోంది. అయితే పాకిస్తాన్ ప్రస్తుతం ఉన్న గ్రే లిస్టు నుంచి బ్లాక్ లిస్టుకు వెళుతుందా లేక క్లీన్ చిట్తో బయటకు పడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే హఫీజ్ సయీద్, మసూద్ అజార్లను పాకిస్తాన్ సీరియస్గా విచారణ చేయాలని అమెరికా గతనెలలో పాక్ను కోరింది. పాకిస్తాన్ నుంచి భారత్లోకి అక్రమంగా చొరబడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా డిమాండ్ చేసింది.
హఫీజ్ సయీద్పై 10 మిలియన్ డాలర్ల రివార్డు
జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ కడుపు మంటతో భారత్ను అంతర్జాతీయ వేదికలపై నిందించి లబ్ధిపొందాలని చూసి చతికిలపడింది. అయితే భారత్ మాత్రం జమ్మూ కశ్మీర్ తమ అంతర్గత విషయం అని అందులో ఎవరి జోక్యం అవసరం లేదని చెబుతూ వచ్చింది. అమెరికా ట్రెజరీ శాఖ హఫీజ్ సయీద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేసింది. హఫీజ్ సయీద్ను పట్టుకుని అప్పజెప్పిన వారికి 2012లో అమెరికా 10 మిలియన్ అమెరికన్ డాలర్లను బహుమతిగా ప్రకటించింది. హఫీజ్ సయీద్ నేతృత్వంలోనే 2008లో ముంబై దాడులు జరిగాయి. ఆ ఘటనలో 166 మంది అమాయకులు మృతి చెందారు.