మోడీ అడుగుజాడల్లో పాక్ ప్రధాని ఇమ్రాన్: ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సంచలన ప్రకటన
ఇస్లామాబాద్ : ఒకరు భారత దేశ ప్రధాని నరేంద్రమోడీ.. మరొకరు దాయాదిదేశం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఎన్నికలకంటే ముందు రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు కనిపించాయి. ఇక ఎన్నికల సమయంలో ప్రధానిగా మోడీ తిరిగి ఎన్నికవ్వాలని మనస్ఫూర్తిగా ఇమ్రాన్ ఖాన్ కోరుకున్నారు కూడా. మోడీ ప్రధాని అయితే పాకిస్తాన్ భారత్తో శాంతి చర్చలు జరుపుతుందని చెప్పారు. అంతకంటే ముందు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాలన విషయంలో మోడీ అడుగుజాడల్లో నడుస్తున్నట్లు కనిపిస్తోంది.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశ ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా పన్నులు కట్టాలని ఆదేశించారు. ప్రభుత్వం టాక్స్ కడితే ఇచ్చే బెనిఫిట్స్ను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా 2016లో ఇదే తరహా ఆఫర్ను ప్రకటించారు. నల్లధనం పై యుద్ధం ప్రకటించిన మోడీ ప్రభుత్వం, బినామీ ఆస్తులపై కూడా కఠిన చర్యలు తీసుకుంది. దీంతో రెవిన్యూ పెరిగింది. ప్రస్తుతం పాక్ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ కూడా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఇలాంటి మార్గాన్నే ఎంచుకున్నట్లు పాక్ మీడియా కథనాలు ప్రసారం చేసింది.
2016 నవంబర్లో ప్రధాని మోడీ ఎలాగైతే టీవీల ముందుకొచ్చి పెద్ద నోట్ల రద్ధును ప్రకటించారో ఇమ్రాన్ ఖాన్ కూడా టీవీల ద్వారా పాక్ ప్రజలకు తన సందేశాన్ని పంపారు. పన్ను కట్టడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. విదేశాల్లో బినామీ ఆస్తులు కలిగి ఉన్నవారు ఈ జూన్ 30లోగా వాటి వివరాలు తెలపాలని ఆదేశించారు. పాకిస్తాన్లో ప్రజలు పన్నులు కట్టడం మరిచిపోతారు కానీ విరాళం మాత్రం ఇవ్వడాన్ని మరువరని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
పాకిస్తాన్లో తిరిగి శ్రేయస్సును నెలకొల్పాలని పిలుపు ఇచ్చిన ఇమ్రాన్ ఖాన్... ఒకరి నొకరికి సహాయం సహకారం అందిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇక మంగళవారం ఆదేశానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ సందేశం ప్రాధాన్యత సంతరించుకుంది.