పాకిస్తాన్: అత్యాచార నేరస్థులను నపుంసకులుగా మార్చే బిల్లుకు ఆమోదం
పాకిస్తాన్లో అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తిని నపుంసకుడిగా మార్చే శిక్షను విధించవచ్చు. పాకిస్తాన్ పార్లమెంటు అత్యాచారానికి సంబంధించిన ఈ కొత్త బిల్లును ఆమోదించింది.
పాకిస్తాన్లో గత కొన్నేళ్లుగా అత్యాచారం కేసులు పెరగడంతో జనాగ్రహం వెల్లువెత్తింది. దీంతో ఈ కొత్త చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించారు.
పాకిస్తాన్ గత ఏడాది అత్యాచార దోషులను నపుంసకులుగా మార్చడంపై ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది. దాదాపు ఏడాది తర్వాత అదే నిబంధనలతో ఒక బిల్లును ప్రవేశపెట్టారు. బుధవారం పార్లమెంటు దానికి ఆమోదముద్ర వేసింది.
"ప్రధానమంత్రి రూపొందించిన నియమాల ప్రకారం కెమికల్ క్యాస్ట్రేషన్(రసాయనాలతో నపుంసకుడుగా మార్చడం) అనే ప్రక్రియను ఆమోదించాం. ఇందులో ఒక వ్యక్తి తన జీవితాంతం సెక్స్ చేయలేకుండా చేస్తారు. దానికోసం కోర్టు మందులు ఉపయోగించాలని ఆదేశిస్తుంది. దానికి తర్వాత ఒక మెడికల్ బోర్డ్ ఆమోదిస్తుంది" అని ఆ బిల్లులో చెప్పారు.
కానీ, అత్యాచారం చేసినవారిని నపుంసకులుగా మార్చే నిబంధనలను సంప్రదాయ ఇస్లామీ గ్రూపులు వ్యతిరేకిస్తున్నాయి.
జమాత్-ఎ-ఇస్లామీ పార్టీ సెనేటర్ ముస్తాక్ అహ్మద్ ఈ బిల్లును ఇస్లాం వ్యతిరేకం అని, షరియాకు విరుద్ధం అని అన్నారు.
"అత్యాచారం చేసిన వారిని బహిరంగంగా ఉరి తీయాలి. కానీ, షరియాలో నపుంసకులుగా మార్చే శిక్ష గురించి ఎలాంటి ప్రస్తావన లేదు" అని చెప్పారు.
- 139 మంది తనపై అత్యాచారం చేశారన్న యువతి కేసులో.. అండగా ఉన్నవాడే అసలు నిందితుడా?
- పిల్లలపై అత్యాచారం: ఉరిశిక్షతో న్యాయం లభిస్తుందా?
కెమికల్ క్యాస్ట్రేషన్
కెమికల్ క్యాస్ట్రేషన్ ప్రక్రియలో మందులు ఇచ్చి ఒక వ్యక్తిని చురుకుగా సెక్స్లో పాల్గొనలేని విధంగా చేస్తారు. ఈ మందు శరీరంలోని టెస్టోస్టెరాన్ హార్మోన్లను తగ్గించేస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో కెమికల్ క్యాస్ట్రేషన్.. అంటే మందులు ఇచ్చి నపుంసకులుగా మార్చే నిబంధనలు ఉన్నాయి.
2016లో ఇండోనేషియా పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడే వారికి కెమికల్ క్యాస్ట్రేషన్ విధించే నిబంధనలు చేర్చింది. 2009లో పిల్లలపై అత్యాచారం కేసుల్లో దోషులకు పోలెండ్ ఈ శిక్షను తప్పనిసరి చేసింది.
మీడియా రిపోర్టుల ప్రకారం దక్షిణ కొరియా, చెక్ రిపబ్లిక్తో పాటూ అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి చట్టం అమల్లో ఉన్నాయి.
పాకిస్తాన్లో ఇటీవలి ఏళ్లలో లైంగిక హింస కేసుల విషయంలో కఠినంగా వ్యవహరించాలనే డిమాండ్ పెరిగింది.
అత్యాచారం కేసుల్లో 4 శాతం కంటే తక్కువ కేసుల్లో మాత్రమే దోషులకు శిక్షలు పడుతున్నాయని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
- విజయవాడ శ్రీలక్ష్మి హత్య నుంచి వరంగల్ పసిపాప అత్యాచారం, హత్య వరకు.. కేసుల ప్రస్తుత పరిస్థితి ఏంటి?
- పాకిస్తాన్లో మహిళల లోదుస్తులు అమ్మడం ఎందుకంత కష్టం
లాహోర్ ఘటన తర్వాత చట్టం
పాకిస్తాన్లో గత ఏడాది అధ్యక్షుడి ఆర్డినెన్స్ ద్వారా అత్యాచార కేసులను తగ్గించడానికి ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు.
అప్పట్లో దేశంలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన గురించి తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. సెప్టెంబర్ 8న లాహోర్ బయట ఒక హైవే మీద చిక్కుకుపోయిన ఒక మహిళపై ఇద్దరు అత్యాచారం చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.
పాకిస్తాన్ సంతతికి చెందిన ఒక ఫ్రెంచ్ మహిళ తన కొడుకుతో హైవే మీద లాహోర్ వస్తున్నప్పుడు ఆమె కారు రిపేరైంది.
మహిళ తన కారులో రోడ్డు పక్కన సాయం కోసం చూస్తున్నప్పుడు, ఇద్దరు ఆమె కారుపై దాడి చేశారు. మహిళ దగ్గర ఉన్నవి దోచుకున్నారు. కొడుకు ముందే తల్లిపై అత్యాచారం చేశారు.
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత కలకలం రేగింది. ఈ గ్యాంగ్ రేప్కు కొంతవరకూ బాధితురాలు కూడా కారణం అని లాహోర్లోని ఒక అత్యున్నత పోలీస్ అధికారి చెప్పడంతో దీనిపై మరింత జనాగ్రతం వెల్లువెత్తింది.
కానీ, ఆ అధికారి ఆ తర్వాత కూడా టీవీలో అదే పునరావృతం చేశాడు. "ఆ మహిళకు బహుశా పాకిస్తాన్ కూడా ఫ్రాన్స్ అంత సురక్షితంగా ఉంటుందని అనిపించిందేమో" అన్నారు.
ఆ తర్వాత పాకిస్తాన్లో వ్యతిరేక ప్రదర్శనలు మొదలయ్యాయి. జనం రోడ్లపైకి వచ్చారు. మహిళలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
దాంతో, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. గత డిసెంబర్లో ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి ఈ కేసులను త్వరగా విచారించి, కఠిన శిక్షలు విధించేలా కొత్త అత్యాచార చట్టం రూపొందించారు.
లాహోర్ అత్యాచారం కేసులో పోలీసులు దాదాపు నెలలోపే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారిపై విచారణ జరిగింది. ఈ ఏడాది మార్చిలో ఇద్దరికీ మరణ శిక్ష విధించారు.
ఇవి కూడా చదవండి:
- తైవాన్ 'పాల సముద్రం’: సుందర ద్వీపం కింద విషం చిమ్మే సాగర రహస్యం
- జమ్మూకశ్మీర్: ఎన్కౌంటర్లో వ్యాపారుల మృతిపై న్యాయ విచారణ
- 'జై భీమ్': ఈ నినాదం ఎలా పుట్టింది, మొట్టమొదట వాడింది ఎవరు
- 'వైఎస్ వివేకానందరెడ్డిని ఎలా చంపామంటే’ - నిందితుల్లో ఒకరి వాంగ్మూలం వెలుగులోకి
- ఉద్దమ్ సింగ్ జనరల్ డయ్యర్ను కాల్చి చంపడానికి ముందు, తర్వాత బ్రిటన్లో ఏం జరిగింది?
- అలెగ్జాండర్ 'గ్రేట్’ కాదా? యోగి ఆదిత్యనాథ్ ఏమన్నారు? పర్షియన్ చరిత్ర ఏం చెబుతోంది?
- అడవిలో కూలి పనులు చేసిన ఈ గిరిజన మహిళ.. రైతులకు రోల్ మోడల్ ఎలా అయ్యారు?
- IPLలో కెప్టెన్గా తప్పించారు, జట్టు నుంచి తీసేశారు, మైదానంలోకీ దిగలేదు.. తన దేశానికి వరల్డ్ కప్ అందించాడు
- గడ్చిరోలి ఎన్కౌంటర్ మృతుల్లో మావోయిస్టు కమాండర్ మిలింద్ తెల్తుంబ్డే
- జిన్నా టవర్ సెంటర్: పాకిస్తాన్ జాతిపిత పేరుతో గుంటూరులో స్తూపం ఎందుకుంది?
- ఆంధ్రప్రదేశ్: పీఆర్సీ కోసం ఉద్యోగుల పట్టు... ఎందుకీ జాప్యం? ప్రభుత్వం ఏమంటోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)