చిన్నారిపై హత్యాచారం: సీరియల్ కిల్లర్కి యావజ్జీవంతోపాటు 4ఉరిశిక్షలు
ఇస్లామాబాద్: ఏడేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసులో లాహోర్లోని ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం (ఏటీసీ) శనివారం సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు 23 ఏళ్ల ఇమ్రాన్ అలీని దోషిగా తేల్చింది. అతనికి యావజ్జీవ శిక్షను విధించడంతో పాటు నాలుగు ఉరిశిక్షలు కూడా విధిస్తూ తీర్పు ఇచ్చింది.
అంతేకాక రూ.10 లక్షల జరిమానా కూడా విధించింది. జైనబ్ అనే చిన్నారితోపాటు మరో ఏడుగురు బాలికలపై కూడా అత్యాచారం, హత్యలకు పాల్పడినట్లు ఇమ్రాన్ అలీపై గతవారం ఇదే కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి.
ఈ కేసు కోసం ఫిబ్రవరి 12న కోట్ లక్పత్ జైలులో న్యాయమూర్తి సజ్జద్ అహ్మద్ 36 మంది సాక్షులను విచారించారు. కాగా, జనవరి 5న జైనబ్ కన్పించకుండా పోయింది. ఆ తర్వాత అదే నెల 9న ఆమె మృతదేహాన్ని షాబాజ్ ఖాన్ రోడ్డుకు సమీపంలోని ఓ చెత్తకుప్ప నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆమెకు న్యాయం జరగాలంటూ పాకిస్థాన్ వ్యాప్తంగా అనేక మంది ర్యాలీ చేపట్టారు. దోషికి న్యాయమూర్తి కఠిన శిక్ష విధించడంతో వారంతా కోర్టు తీర్పును స్వాగతిస్తున్నారు.