అద్దాల గదిలో.. నిఘా నీడలో, జాదవ్‌‌ను కళ్లారా చూసి.. చలించిపోయిన తల్లీ భార్య!

ఇస్లామాబాద్: ఆయన మరణం అంచుల్లో ఉన్నారు. తల్లిని, భార్యను చూడాలనుకున్నారు. ఆయన వినతి ఫలించింది. కానీ, అద్దాల తెరలు ఆ తల్లీ కొడుకుల అనుబంధానికి అడ్డుగోడగా నిలిచాయి.

ఆ తల్లి ఆప్యాయంగా తన కుమారుడి తలను నిమరలేకపోయింది. అమ్మా.. అంటూ తల్లి ఒడిలో తలవాల్చలేని పరిస్థితి అతనిది. ఇదీ సరిహద్దుల ఆవల పాకిస్తాన్‌ చెరలో ఉన్న కులభూషణ్‌ జాదవ్‌ దుస్థితి.

ఎట్టకేలకు తల్లిని, భార్యను అనుమతించిన పాక్...

ఎట్టకేలకు తల్లిని, భార్యను అనుమతించిన పాక్...

భారత గూఢచారిగా పనిచేస్తూ, ఇరాన్‌ మీదుగా తమ భూభాగం బలూచిస్థాన్‌లోకి ప్రవేశించాడన్న ఆరోపణలపై కులభూషణ్‌ జాదవ్‌ను గత ఏడాది మార్చిలో పాక్‌ సైన్యం అదుపులోకి తీసుకొన్న సంగతి తెలిసిందే. ఈ నేరానికి సంబంధించి పాకిస్తాన్ కోర్టు అతడికి మరణశిక్ష కూడా విధించింది. అయితే, మనదేశం చేసిన ప్రయత్నాలతో, ఐక్యరాజ్యసమితి చొరవతో.. జాదవ్‌కు పాకిస్తాన్ కోర్టు విధించిన మరణశిక్ష అమలుపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించింది. ఈ నేపథ్యంలో తమ జాతిపిత మహమ్మద్‌ అలీ జిన్నా జయంతి సందర్భంగా జాదవ్‌ను, ఆయన కుటుంబసభ్యులు కలుసుకొనేందుకు అనుమతిస్తున్నట్టు పాక్‌ ప్రభుత్వం ప్రకటించింది. కానీ, అందుకు తగిన స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించలేదు. అడగడుగునా హైటెన్షన్‌ వాతావరణం నెలకొనేలా చేసింది.

తల్లీ, భార్య పాకిస్తాన్‌కు ఇలా వెళ్లారు...

తల్లీ, భార్య పాకిస్తాన్‌కు ఇలా వెళ్లారు...

కులభూషణ్ జాదవ్ తల్లి అవంతిక జాదవ్, ఆయన భార్య చేతన ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్లి అక్కడ్నించి పాకిస్తాన్ చేరుకున్నారు. ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయంలో అధికారులను కలుసుకున్నారు. ఆ తరువాత అక్కడ్నించి ప్రత్యేక వాహనంలో పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే ఆ కార్యాలయ పరిసరాల్లో గట్టి బందోబస్తు కనిపించింది. షార్ప్ షూటర్ల బృందాలను, డాగ్ స్క్వాడ్‌ను ప్రత్యేక సైనికబలగాలను విదేశాంగ శాఖ కార్యాలయం చుట్టూ మోహరించారు. పాక్‌లోని భారతీయ డిప్యూటీ హై కమిషనర్‌ జేపీ సింగ్‌ వెంటరాగా.. జాదవ్‌ తల్లి అవంతిక జాదవ్, భార్య చేతన సోమవారం మధ్యాహ్నం 1.35 గంటలకు ఆ కార్యాలయంలోకి అడుగుపెట్టారు. అఘాసాహీ బ్లాక్‌లోని ప్రధాన భవంతిలో అడుగుపెట్టగానే, వారి వెనుక తలుపులు మూసుకుపోయాయి. ఆ ముగ్గురికి అక్కడ ఓ మహిళ దారి చూపించింది.

జాదవ్‌ను చూసి చలించిపోయిన తల్లీ, భార్య...

జాదవ్‌ను చూసి చలించిపోయిన తల్లీ, భార్య...

ఆ భవంతిలో ఒక మూలన అద్దాల గదికి అవతల కులభూషణ్ జాదవ్‌ని చూడగానే ఆయన తల్లీ, భార్య చలించిపోయారు. ఆ సమయంలో జాదవ్‌ నీలం రంగు కోటులో కనిపించాడు. అద్దాలకు అవతల జాదవ్‌ నిలబడి ఉండగా, ఇవతల తల్లి, భార్య నిలబడాల్సి వచ్చింది. 21 నెలల తర్వాత కన్నకొడుకుని కళ్లారా చూసుకున్నా.. తనివితీరా గుండెలకు హత్తుకోలేకపోయానన్న బాధతో జాదవ్ తల్లి అవంతిక తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఇక భార్య చేతన అయితే కన్నీరు ఆపుకోలేకపోయింది. అవతల అద్దాల్లోంచి జాదవ్‌ తన ముందున్న ఫోన్‌లో మాట్లాడుతుండగా, ఇవతల నుంచి ఆయన తల్లి, భార్య మాట్లాడారు. ఇలా దాదాపు 40 నిమిషాలపాటు వారు మాట్లాడుకున్నారు.

తిరుగుతూనే ఉన్నారు.. వింటూనే ఉన్నారు...

తిరుగుతూనే ఉన్నారు.. వింటూనే ఉన్నారు...

కులభూషణ్ జాదవ్‌తో మాట్లాడుకోవడానికి పాక్ అధికారులు అనుమతించినా.. వారికి ఏకాంతం మాత్రం కల్పించలేదు. ఇంటరాగేషన్ రూమ్‌‌నే వీరి కలయికకు సిద్ధం చేశారు. ఆ గదిలో నాలుగు కెమెరాలు పెట్టారు. అంతేకాదు, వీరు మాట్లాడుకుంటున్నంతసేపూ పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ అధికారులు అటూ ఇటూ తిరుగుతూ, వారి మాటలను ఆలకిస్తూనే ఉన్నారు. వారు మాట్లాడుకునే టెలిఫోన్ రిసీవర్ చుట్టూ టేప్ చుట్టి ఉంది. బహుశా అందులో ముందుగానే రికార్డింగ్ పరికరం ఏదైనా పెట్టి ఉండొచ్చు. అనంతరం వారు మాట్లాడుకుంటున్న వీడియో ఒకదానిని పాక్ ప్రభుత్వం విడుదల చేసింది. పాక్ అధికారులు ఈ కలయిక, మాటామంతీని ఓ మొక్కుబడి తంతుగానే నడిపించారు. జాదవ్‌ కేసు ప్రస్తుతం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణలో ఉన్నందున.. కోర్టు దృష్టిలో మార్కులు కొట్టేసే ఎత్తుగడగానే పాక్‌ తీరు ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

పాక్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన జాదవ్...

పాక్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన జాదవ్...

కులభూషణ్ జాదవ్‌తో మాట్లాడిన అనంతరం ఆయన తల్లి అవంతిక జాదవ్, భార్య చేతన తిరిగి భారతీయ రాయబార కార్యాలయానికి చేరుకున్నారు. ఆ తరువాత అక్కడ్నించి స్వదేశానికి బయలుదేరారు. జాదవ్‌ను కలుసుకుని ఆయన కుటుంబ సభ్యులు వెనుదిరిగిన కొద్దిసేపటికే పాక్ ప్రభుత్వం వారి భేటీ ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఆ తరువాత కొద్దిసేపటికి.. జాదవ్ ‘ధన్యవాదాలు' చెబుతున్న ఓ వీడియోను కూడా విడుదల చేసింది. దాంట్లో ఆయన ‘‘రెండేళ్ల క్రితం ‘రా(రిసెర్చ్‌ అనాలిసిస్‌ వింగ్‌)' తరఫున పనిచేస్తూ ఇరాన్‌ మీదుగా పాకిస్తాన్‌లోకి అడుగుపెట్టాను. పాకిస్తాన్‌ అధికారులు నన్ను వృత్తినిబద్ధతతో ఎంతో గౌరవంగా చూస్తున్నారు. నా తల్లి, భార్యతో ములాఖత్‌ ఏర్పాటు చేయాలని నేను కోరాను. మానవతా దృక్పథంతో అందుకు అవకాశం కల్పించిన పాకిస్తాన్‌ ప్రభుత్వానికి కృతజ్ఞుడినై ఉంటాను..'' అని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+