రూటు మార్చిన పాకిస్తాన్..
India Pakistan War: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాదుల దాడి అనంతరం.. భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. రెండు దేశాలు కూడా కాలు దువ్వుకుంటోన్నాయి. యుద్ధ సన్నాహాలు సైతం చేపట్టాయి.
ఈ పరిస్థితుల మధ్య పాకిస్తాన్ బరితెగిస్తోంది. తన తెంపరితనాన్ని ప్రదర్శిస్తోంది. నిన్నటి వరకూ జమ్మూ కాశ్మీర్ సమీపంలో నియంత్రణ రేఖ (LoC) పొడవునా కాల్పులకు తెగబడుతూ వస్తోంది పాకిస్తాన్ సైన్యం. భారత ఆర్మీ పోస్టులపై తేలికపాటి ఆయుధాలతో కాల్పులు జరిపింది. యుద్ధానికి రెచ్చగొడుతోంది.

వ్యూహాత్మకంగా అత్యంత సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలుగా భావించే జమ్మూ జిల్లా పర్గ్వాల్ సెక్టార్ పరిధిలో అంతర్జాతీయ సరిహద్దు పొడవునా గల భారత ఆర్మీ పోస్టులపై కొద్దిరోజుల కిందటే ఈ కాల్పులకు దిగింది పాకిస్తాన్. దీన్ని భారత జవాన్లు విజయవంతంగా తిప్పి కొట్టారు.
భారత్తో యుద్ధ మేఘాలు తీవ్రతరమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ను అత్యవసరంగా సమావేశపర్చనున్నారు. దీనికి అవసరమైన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సాయంత్రం 5 గంటలకు రాజధాని ఇస్లామాబాద్లో పాకిస్తాన్ పార్లమెంట్ సమావేశం కానుంది.
ఈ పరిస్థితుల మధ్య పాకిస్తాన్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి అంతర్జాతీయ మీడియాను తీసుకెళ్లనుంది. దీనికి త్వరలోనే ముహూర్తం పెట్టనుంది. అక్కడి పరిస్థితులు, ప్రజల స్థితిగతులను ప్రపంచానికి తెలియజేయాలని తీర్మానించుకుంది.
అదే సమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఏ ఉగ్రవాది కూడా ఉండట్లేదని, ఉగ్రవాద సంస్థలకూ ఎలాంటి షెల్టర్ ఇవ్వట్లేదని బయటి ప్రపంచానికి చెప్పుకొనే ప్రయత్నాలకు తెర తీసింది. అదే సమయంలో భారత్పైనా దుష్ప్రచారం చేయడానికి దీన్ని ఉపయోగించుకోవచ్చని పాకిస్తాన్ భావిస్తోన్నట్లు సమాచారం.
పహల్గామ్ ఉగ్రవాద దాడి విషయంలో తమ తప్పు లేదని అంతర్జాతీయ మీడియా ద్వారా పాకిస్తాన్ బుకాయించే ప్రయత్నం చేయవచ్చని అంటున్నారు. ఈ దాడి తరువాత భారత్ తీసుకున్న అనేక నిర్ణయాలను తప్పు పట్టేలా వ్యవహరిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఇండస్ వాటర్ ట్రీటీ రద్దు అంశాన్ని ప్రధానంగా అంతర్జాతీయ మీడియాకు వివరించవచ్చు.












Click it and Unblock the Notifications