భారత్ను నాజీ జర్మనీతో పోల్చిన ఇమ్రాన్ ఖాన్.. మరోసారి అంతర్జాతీయ వేదికపై విద్వేషం..
గతేడాది ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ దళంపై మిలిటెంట్ దాడి జరిగిన తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో భారత ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత జటిలం చేశాయి. భారత్ అంటే చాలా దేశాలకు అతిపెద్ద మార్కెట్గా మారిపోయిందని,అందుకే తమ వాదనకు మిగతా దేశాలేవీ మద్దతునివ్వట్లేదని ఇమ్రాన్ ఆ వేదికపై వాదించారు. తాజాగా మరోసారి అవే వ్యాఖలు చేసిన ఇమ్రాన్.. భారత్లో పాలనను నాజీ జర్మనీతో పోల్చారు. సందర్భం వచ్చిన ప్రతీసారి అంతర్జాతీయ వేదికలపై ఇమ్రాన్ భారత్పై విమర్శలు,ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.

ఇమ్రాన్ ఏమన్నారు..
స్విట్టర్లాండ్లోని దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్-2020 సమావేశానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్పై మరోసారి పలు విమర్శలు చేశారు.'హౌడీ మోదీ వల్ల నాకేమీ బాధ లేదు. అమెరికా-భారత్ మధ్య సంబంధాలను అర్థం చేసుకున్నాను. భారత్ అతిపెద్ద మార్కెట్ కలిగిన దేశం. కానీ భారత్ అనుసరిస్తున్న మార్గంపై ఆందోళన చెందుతున్నాను. ఒక్కసారి మీరు చరిత్రను, నాజీ జర్మనీ క్రమాన్ని చదివినట్టయితే.. ప్రస్తుతం భారత్లోనూ అవే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.

భారత్ను నాజీ జర్మనీతో పోల్చిన ఇమ్రాన్..
పౌరసత్వ సవరణ చట్టం(CAA)నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. భారత్ను ఇమ్రాన్ నాజీ జర్మనీతో పోల్చారు. రెండోసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత భారత్లో జింగోయిజం మరింత పుట్టుకొచ్చిందన్నారు. ఇప్పటికే భారత్లో తీవ్ర నిరసనలు జరుగుతున్నాయని,నియంత్రణ రేఖ వెంబడి బాంబు దాడులు జరుగుతున్నాయని చెప్పారు. వీటి నుంచి దృష్టి మరల్చేందుకు ప్రభుత్వం ఏమైనా చేయవచ్చన్నారు.

ఐరాస,అమెరికా జోక్యం చేసుకోవాలని..
అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాల మధ్య ఇలాంటి పరిస్థితులు పరిస్థితులు ఉండరాదని ఇమ్రాన్ అన్నారు. అందుకే ప్రపంచ దేశాలను నియంత్రణ రేఖ వద్దకు రమ్మని కోరుతున్నానని చెప్పారు. 'పుల్వామాలో ఏం జరిగింది..? దానిపై విచారణ జరిపించమని కోరాం. కానీ వాళ్లు పాకిస్తాన్ గగనతలంలోకి దూసుకొచ్చి బాంబు దాడులు చేశారు. ప్రస్తుతం మేము ఎలాంటి వివాదానికి,సంఘర్షణకు దగ్గరగా లేము. కాబట్టి అమెరికా,ఐరాస రెండూ జోక్యం చేసుకోవాలని నేను ఎదురుచూస్తున్నాను.' అని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు.

గతేడాది ఐరాస అసెంబ్లీలోనూ..
గతేడాది జరిగిన ఐరాస సర్వ ప్రతినిధుల సభలోనూ ఇమ్రాన్ భారత్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, పొరుగు దేశంతో ఒకవేళ యుద్దం వస్తే.. వారి కంటే ఏడు రెట్లు చిన్న దేశమైనప్పటికీ.. చివరి ఊపిరి వరకు పోరాడుతామని అన్నారు. పుల్వామాపై దాడి జరిగితే తమపై నింద వేయడమేంటని ప్రశ్నించారు. దాడిలో తమ పాత్రపై ఆధారాలు కోరితే.. తమ దేశంపై బాంబులు వేశారని అప్పట్లో ఆరోపించారు.












Click it and Unblock the Notifications