Kulbhushan Jadhavకు భారీ ఊరట- అప్పీలుకు పాక్ పార్లమెంటు ఆమోదం
గూఢచర్యం ఆరోపణలతో పాకిస్తాన్ ఉరిశిక్ష విధించిన భారత నేవీ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్కు ఇవాళ భారీ ఊరట లభించింది. జాదవ్ తనకు విధించిన ఉరిశిక్షపై అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ రూపొందించిన బిల్లుకు పాకిస్తాన్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. గతంలో అంతర్జాతీయ న్యాయస్ధానం ఇచ్చిన తీర్పు ప్రకారం జాదవ్కు అవకాశం కల్పిస్తూ పార్లమెంటు ఓ బిల్లును ఆమోదించింది. దీంతో ఉరిశిక్షపై జాదవ్ అప్పీలు చేసుకునేందుకు వీలు కలిగింది.
Recommended Video
ఐసీజే (రివ్యూ అండ్ రీకన్సిడరేషన్) బిల్లు 2020పై చర్చించిన జాతీయ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 2017 ఏప్రిల్లో గూఢచర్యం, తీవ్రవాద ఆరోపణలపై పాకిస్తాన్ మిలటరీ కోర్టు కుల్భూషణ్ జాదవ్కు మరణశిక్ష విధించింది. దీనిపై భారత్ అంతర్జాతీయ న్యాయస్దానంలోఅప్పీలు చేసింది. దీనిపై విచారణ జరిపిన అంతర్జాతీయ న్యాయస్దానం.. అప్పీలుకు అనుమతించాలని పాకిస్తాన్కు ఆదేశాలు ఇచ్చింది. దీంతో పాటే భారత దౌత్యవేత్తల్ని కలిసేందుకు కూడా అనుమతించాలని ఆదేశించింది. దీంతో పాకిస్తాన్ ఇలా మిలటరీ ఉరిశిక్ష విధించిన ఖైదీకి అప్పీలు అవకాశం కల్పించేలా ఓ బిల్లును రూపొందించి పార్లమెంటులో దానికి ఆమోదం తెలపాల్సి వచ్చింది.
ఈ బిల్లు తాము ఆమోదించకపోతే అంతర్జాతీయ న్యాయస్ధానం తీర్పు ధిక్కరణపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సభ్య దేశం హోదాలో పాకిస్తాన్పై కోర్టు ధిక్కరణ చర్యలకు ప్రతిపాదించే అవకాశముందని పాకిస్తాన్ న్యాయశాఖమంత్రి ఫారోగ్ నసీమ్ తెలిపారు. అంతర్జాతీయ న్యాయస్ధానం ఆదేశాల మేరకే ఈ బిల్లును ఆమోదించామన్నారు. తద్వారా పాకిస్తాన్ను బాధ్యతాయుత దేశంగా ప్రపంచానికి మరోసారి నిరూపించామని ఆయన వెల్లడించారు. మరోవైపు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ విపక్షాలు పార్లమెంట్ నుంచి వాకౌట్ చేశాయి.